ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పట్ల కేసీఆర్ సంతాపం

పటాన్‌చెరూ సమీపంలో ఓఆర్‌ఆర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. ఓఆర్‌ఆర్‌పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమె ఘటనా స్థలంలోనే మరణించారు. ఎమ్మెల్యే సాయన్న మరణంతో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన కూతురు లాస్య నందితకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కంటోన్మెంట్‌ సీటు ఇచ్చారు. బీజేపీ అభ్యర్థిపై ఆమె సాధించిన విషయం తెలిసిందే.

ఇక ఈమె మృతి పట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ (KCR) ఈ ఘటన ఫై స్పందించారు. రోడ్డు ప్రమాదంలో ఆమె అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమన్నారు. అతిపిన్న వయస్సులో ఎమ్మెల్యేగా నందిత ప్రజల మన్ననలు పొందారని చెప్పారు. కష్టకాలంలో వారి కుటుంబానికి బీఆర్‌ఎస్‌ అండగా ఉంటుందని తెలిపారు. లాస్య నందిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందిస్తూ.. నందిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.. లాస్య ఇక లేరనే అత్యంత విషాదకరమైన, షాకింగ్‌ న్యూస్‌ తెలుసుకున్నానని చెప్పారు. దాదాపు వారం క్రితమే ఆమెను పరామర్శించానని, అంతలోనే మళ్లీ ప్రమాదానికి గురై మృతి చెందడం బాధాకరమన్నారు. చాలా మంచి నాయకురాలిగా ఉన్న యువ శాసనభ్యురాలిని కోల్పోవడం బీఆర్‌ఎస్‌ పార్టీకి తీరని నష్టమని చెప్పారు. ఈ విషాద సమయంలో ఆమె కుటుంబం, స్నేహితులకు బలం చేకూర్చాలని ప్రార్థించారు.

ఇక సీఎం రేవంత్ సైతం లాస్య మృతి దిగ్భ్రాంతి గురి చేసిందన్నారు. నందిత తండ్రి స్వర్గీయ సాయన్నతో తనుకు సన్నిహిత సంబంధం ఉండేదని గుర్తుచేసుకున్నారు. ఆయన గత ఏడాది ఇదే నెలలో స్వర్గస్తులవడం, ఇదే నెలలో నందిత కూడా ఆకస్మికంగా మరణం చెందడం అత్యంత విషాదకరమని సామాజిక మాధ్యమం ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా తెలిపారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.