రేపు మధ్యాహ్నం మంత్రిగా మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం

ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కి బంపర్ ఆఫర్ ఇచ్చారు సీఎం కేసీఆర్. అసెంబ్లీ టికెట్ ఇవ్వకపోవడం తో నిరాశ చెందిన ఆయనకు మంత్రివర్గంలో చోటు కల్పించి సంతృప్తి పరిచారు. ఈటల రాజేందర్ స్థానంలో ఖాళీ అయిన బెర్త్‌ను ఇప్పటి వరకు అలాగే ఉంచారు. ఖాళీగా ఉన్న ఈ స్థానంలో మహేందర్ రెడ్డికి ముఖ్యమంత్రి అవకాశం కల్పించారు. గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు మహేందర్ రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఎమ్మెల్సీగా ఉన్న పట్నం మహేందర్ రెడ్డి ఈసారి ఎన్నికల్లో తాండూరు నుంచి టికెట్ ఆశిస్తూ వస్తున్నారు. కానీ.. అక్కడ పైలెట్ రోహిత్ రెడ్డి సిట్టింగ్‌గా ఉండటం.. మొన్న జరిగిన ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలో పార్టీకి విధేయంగా ఉండటంతో.. మళ్లీ ఆయనకే ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. కాగా.. బుజ్జగింపు పర్వంలో భాగంగా.. పట్నం మహేందర్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వనున్నట్టు హామీ ఇచ్చినట్టు సమాచారం. అయితే.. పట్నం మహేందర్ రెడ్డికి ఏ శాఖ ఇవ్వనున్నారన్నది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.