అగ్నిపథ్ పథకాన్ని ఆపేందుకు ఎలాంటి కారణాలు లేవు: ఢిల్లీ హైకోర్టు

Delhi High Court
Delhi High Court

న్యూఢిల్లీః సాయుధ బలగాల భర్తీ కోసం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీంను ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. గతేడాది తీసుకొచ్చిన ఈ పథకంపై ఆందోళనలు వెల్లువెత్తాయి. 2019లో రిలీజైన రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ ను సవాలు చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు ఆ పిటిషన్‌లను కొట్టివేసింది. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా, సాయుధ బలగాలను బలోపేతం చేసేందుకే ఈ పథకాన్ని రూపొందించినట్టు స్పష్టం చేసింది. అగ్నిపథ్ స్కీం ను ఆపేందుకు ఎలాంటి కారణాలు లేవన్న కోర్టు.. ఈ పథకంపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేస్తున్నట్టు ప్రకటించింది.

కాగా, జూన్‌ 14, 2022న భారత ప్రభుత్వం ఆమోదించిన అగ్నిపథ్ పథకాన్ని 2022 సెప్టెంబరు నుండి అమలు చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అగ్నిపథ్ స్కీంకు 17 నుంచి 21 సంవత్సరాల మధ్య వయస్సున్న వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని గతేడాది ఇచ్చిన నోటిఫికేషన్ లో తెలిపింది. ఈ విధానం ద్వారా నియమితులైన వారిని అగ్ని వీర్ లు అంటారు. వీరి ఉద్యోగ కాలం నాలుగు సంవత్సరాలు. ఈ పథకం ప్రకారం గతంలో ఉన్నట్లుగా దీర్ఘ కాలం పాటు పని చేసే పద్ధతి పోతుంది. ఉద్యోగం నుండి విరమించాక పింఛను కూడా రాదు. దీంతో అప్పట్లో ప్రతిపక్షాలు ఈ పథకాన్ని విమర్శిస్తూ దానిలోని లోపాలను ఎత్తిచూపాయి. పార్లమెంటులో చర్చించేవరకు ఈ పథకాన్ని నిలిపివేయాలని కోరాయి. ఈ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. అభ్యర్థులు12 రైళ్ళను కూడా తగలబెట్టారు. అనేక రైళ్ళను మధ్య లోనే నిలిపివేయడం, రద్దు చెయ్యడం జరిగింది.