బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందితకు ప్రమాదం
నల్గొండలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభ నుంచి తిరిగి హైదరాబాద్ వస్తున్న క్రమంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. నార్కట్పల్లి సమీపంలోని చెర్లపల్లి వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. అదే వేగంతో వెళ్లి ట్రాఫిక్ నియంత్రిస్తున్న హోంగార్డులను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే తలకు గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఓ హోంగార్డు అక్కడికక్కడే చనిపోగా మరొకరిని ఆసుపత్రికి తరలించారు.
కారులో ఉన్న ఎమ్మెల్యే తలకు స్వల్పగాయాలయ్యాయి. అదే కారులో ఆమె సోదరి నివేదిత, ఇద్దరు గన్మెన్లు ఉన్నారు. ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఎమ్మెల్యే లాస్య నందిత తన సోదరితో కలిసి మరో కారులో హైదరాబాద్ చేరుకున్నారు. ప్రమాదానికి గురైన రెండు కార్లను పోలీసులు నల్గొండ రూరల్ పోలీస్ స్టేషన్కి తరలించారు. ఈ ఘటనలో చనిపోయిన హోంగార్డును నార్కట్పల్లి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న నవ కిషోర్గా గుర్తించారు.
మరోవైపు లాస్యనందిత కారుకు ప్రమాదం జరిగిన విషయం తెలియగానే బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో తాను క్షేమంగా ఉన్నానంటూ లాస్యనందిత ఎక్స్లో ట్వీట్ చేశారు. స్వల్ప గాయాలతో బయటపడ్డానని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ప్రమాదం తర్వాత ప్రథమ చికిత్స తీసుకుని హైదరాబాద్ బయల్దేరినట్లు ట్వీట్ చేశారు.