ఈడీ కస్టడీ నుంచి కేజ్రీవాల్ రెండో ఆదేశాలు జారీ
న్యూఢిల్లీః మద్యం పాలసీ కేసులో అరెస్టైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి మరో ఉత్తర్వును జారీ చేశారు. ఇప్పటికే కస్టడీ నుంచి తొలిసారి ఇచ్చిన ఆదేశాలపై ఈడీ దర్యాప్తు చేస్తున్న సమయంలో తాజాగా మరోసారి ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం ఉదయం లాకప్ నుంచి కేజ్రీవాల్ ఆరోగ్యశాఖకు సంబంధించి రెండో ఆదేశాలు జారీ చేశారు.
కేజ్రీవాల్ జారీ చేసిన ఆదేశాలను దిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ చదివి వినిపించారు. ‘జైలులో ఉన్నప్పటికీ దిల్లీ ప్రజల ఆరోగ్యంపై కేజ్రీవాల్ ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై నాకు ఆదేశాలు జారీ చేశారు. దిల్లీలోని కొన్ని ఆస్పత్రుల్లో, మొహల్లా క్లినిక్ల్లో ప్రజలకు ఉచిత మందులు అందుబాటులో లేవు. వాటిని అందుబాటులో ఉంచాలి. కొన్ని ఆస్పత్రుల్లో ఉచిత పరీక్షలు కూడా నిర్వహించడం లేదు. ఈ సమస్యలను పరిష్కరించాలి’ అని తనని ఆదేశించినట్లు ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు.