కెటిఆర్‌ను అధికారం పోయిందన్న బాధ వెంటాడుతోందిః సీతక్క

ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని వెల్లడి

minister-seethakka-comments-on-brs-working-president-ktr

హైదరాబాద్‌ః మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కెటిఆర్‌ను అధికారం పోయిందన్న బాధ వెంటాడుతోందని మంత్రి సీతక్క బుధవారం ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలకులకు ఇప్పుడు అసలు ఆట ఉందని, అలవిగాని హామీలు ఇచ్చారంటూ అంతకుముందు కెటిఆర్ విమర్శలు గుప్పించారు. కెటిఆర్ వ్యాఖ్యలపై సీతక్క ఘాటుగా స్పందించారు. బిఆర్ఎస్ నాయకులకు అంత తొందరపాటు పనికి రాదన్నారు. అధికారం పోయిందన్న బాధ వారిలో కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు.

ఎన్నికల ప్రచారం సయమంలో తాము ఇచ్చిన హామీలకు.. బిఆర్ఎస్ జోడించి చెప్పారని గుర్తు చేశారు. అలాంటప్పుడు వారు ఎలా ప్రశ్నిస్తున్నారని, ఇచ్చిన ప్రతి హామీని తాము నెరవేరుస్తామని వ్యాఖ్యానించారు. ఒక్కో హామీని అమలు చేసుకుంటూ వస్తున్నామని తెలిపారు. రైతులకు ఇచ్చిన మాటను కచ్చితంగా నిలబెట్టుకుంటామన్నారు. కాంగ్రెస్ గెలిచిందని ప్రజలంతా సంతోషపడుతున్నారని చెప్పారు.