బిజెపి ఎంపీ విజిటర్ పాస్తో లోక్సభలో చొరబడ్డ దుండగులు
న్యూఢిల్లీ : లోక్సభలోకి ఇద్దరు దుండగులు చొరబడి హల్చల్ సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పట్టుబడ్డ ఆగంతకుల్లో ఒకరైన సాగర్ శర్మ.. మైసూర్ బిజెపి ఎంపీ ప్రతాప్ సింహా విజిటర్ పాస్తో లోక్సభ విజిటర్స్ గ్యాలరీలోకి ప్రవేశించినట్లు నిర్ధారించారు. మరో ఆగంతకుడిని మైసూర్కు చెందిన మనోరంజన్ డీగా గుర్తించారు. అతను వృత్తిరీత్యా ఇంజినీర్ అని పోలీసులు తెలిపారు. ఆగంతకుల్లో ఒకరు తమ బూట్లలో దాచుకున్న ఎల్లో కలర్ గ్యాస్ను సభలో వదిలారు. దీంతో ఎంపీలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ఇక పార్లమెంట్ బయట కూడా మరో ఇద్దరు వ్యక్తులు హంగామా సృష్టించారు. టియర్ గ్యాస్ను వదిలారు. మహిళతో పాటు మరో వ్యక్తిని అరెస్టు చేశారు పోలీసులు. హర్యానాకు చెందిన నీలమ్ (42) అనే మహిళతో పాటు మహారాష్ట్రకు చెందిన అమోల్ షిండే (25) పార్లమెంట్ బయట టియర్ గ్యాస్ ప్రయోగించినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో మొత్తం నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో లోక్సభలో విజిటర్స్ పాసులపై స్పీకర్ ఓం బిర్లా నిషేధం విధించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు విజిటర్స్ పాస్లపై నిషేధం అమల్లో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.