రాహుల్ కు కేంద్రం షాక్ : అధికారిక నివాసం ఖాళీ చేయాలంటూ నోటీసులు

ఎంపీ పదవికి అనర్హత గురైన కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కి కేంద్రం మరో షాక్ ఇచ్చింది. ఢిల్లీలోని తన అధికార నివాసాన్ని ఖాళీ చేయాలంటూ నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 22 లోగా అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాలని లోక్ సభ హౌసింగ్ కమిటీ స్పష్టం చేసింది. 2004లో లోక్‌సభ ఎంపీగా ఎన్నికైన అనంతరం రాహుల్‌ గాంధీకి తుగ్లక్‌ వీధిలోని 12 నంబర్‌ బంగ్లాను కేటాయించారు. అయితే ఇప్పుడు అనర్హతకు గురైనందున ప్రభుత్వ నివాస గృహంలో ఉండటానికి అర్హుడు కాడని నోటీసులో పేర్కొంది.

ప్రధాని మోడీ ఇంటి పేరు కలవారందరూ దొంగలే అంటూ వ్యాఖ్యానించి రెండేళ్ల జైలుశిక్ష పొందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ పై అనర్హత వేటు పడింది. ఈ మేరకు లోక్‌ సభ జనరల్‌ సెక్రటరీ నోటిఫికేషన్‌ ను రిలీజ్‌ చేశారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి మరో షాక్‌ తగిలింది. మరి దీనిపై కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎలా స్పందిస్తారో చూడాలి.

రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్ లోక్ సభ స్థానానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తూ ఉండేవారు. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఈ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ప్రధాని మోడీ ఇంటిపేరు వ్యవహారంలో ఆయనను సూరత్ న్యాయస్థానం దోషిగా తేల్చిన నేపథ్యంలోఆయనపై అనర్హ వేటు పడింది. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల ప్రచార సమయంలో ఆయన కర్ణాటకలోని కోలార్ లో రోడ్ షో, భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఆ సమయంలో మోడీ ఇంటిపేరును ప్రస్తావించారు. వేల కోట్ల రూపాయల మేర బ్యాంకులను మోసగించి దేశం విడిచి పారిపోయిన ఆర్థిక నేరగాళ్ల పేర్లన్నీ మోడీ ఇంటిపేరుతోనే ఎందుకు ఉంటోన్నాయని ప్రస్తావించారు. దీనిపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ రాహుల్ పై పరువు నష్టం దావా వేయగా, సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష విధించింది. దాంతో, నిబంధనల ప్రకారం రాహుల్ పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు పడింది.