మహిళా సాధికారిత గురించి మాట్లాడే హక్కు వైస్సార్సీపీ నేతలకు లేదు

మహిళా సాధికారిత అంటే ‘కచ్చా బాదాం’ సాంగ్ కి డ్యాన్స్ చేసినంత ఈజీ అనుకుంటున్నావా రోజా ?: అనిత

అమరావతి : విజయవాడ అత్యాచార ఘటన, వాసిరెడ్డి పద్మ-టీడీపీ నేతల మాటల యుద్ధం నేపథ్యంలో చీరలు కట్టుకోవాలంటూ మంత్రి రోజా టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ అగ్రనేత లోకేశ్ లపై వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి రోజాపై టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మహిళా సాధికారిత గురించి మాట్లాడే హక్కు వైస్సార్సీపీ నేతలకు లేదన్నారు. మహిళా సాధికారిత అంటే ‘కచ్చా బాదాం’ పాటకు డ్యాన్స్ చేసినంత ఈజీ అనుకుంటున్నావా? జబర్దస్త్ లో డబుల్ మీనింగ్ డైలాగులకు వెకిలి నవ్వులు నవ్వుకూంటూ పారితోషికం తీసుకోవడం అనుకుంటున్నావా? అంటూ మండిపడ్డారు.

“పాత సినిమాల్లో బందిపోట్లు రోడ్డు మీదికి వస్తే అందరూ ఇళ్లలోకి పరిగెత్తుకెళ్లి తలుపులు వేసుకునేవారు. ఇప్పుడీ సీఎం బందిపోటులా ఊరి బయటకి వస్తే ప్రజల పరిస్థితి ఇలాగే ఉంది. ఇతగాడు ఇల్లు దాటి బయటికి వస్తే పోలీసులందరూ పహారా కాయడం ఒకెత్తయితే, షాపులూ మూసేయాలట, ప్రజలు ఇళ్లలోకి వెళ్లి కిటికీ తలుపులు కూడా వేసుకోవాలట. వీళ్లు చంద్రబాబు కరకట్ట నివాసం గురించి మాట్లాడేవాళ్లా? వీళ్లకు సిగ్గుందా? బుర్రలు ఏమైనా పనిచేస్తున్నాయా లేదా? మహిళా సాధికారిత జగన్ మోహన్ రెడ్డితోనే సాధ్యం అంటుంటే నాకు నవ్వొస్తోంది. రాష్ట్రంలో జరిగిన అనేక అత్యాచార ఘటనలపై నోరు మెదపని సీఎంకు చెప్పండి ఏం రంగు చీర కట్టుకోవాలో!” అంటూ రోజాపై అనిత నిప్పులు చెరిగారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/