చంద్రబాబు, పవన్ కలిసొచ్చినా వైఎస్‌ఆర్‌సిపి ఓడించలేరుః మంత్రి రోజా

జగన్‌పై కుట్రలు చేయాలని చూస్తే తరిమికొడతామని హెచ్చరిక

minister-rk-roja-fires-on-chandrababu-and-pawan-kalyan

అమరావతిః మంత్రి ఆర్కే రోజా ఈరోజు మాచర్ల నియోజకవర్గంలో పర్యటించారు. శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి తిరునాళ్ల మహోత్సవం సందర్బంగా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైతు సంబరాల్లో భాగంగా ఎడ్ల బండలాగుడు పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి పట్టిన దరిద్రం, సైతాన్‌ చంద్రబాబు అని రోజా ఆరోపించారు. టిడిపి, జనసేన పార్టీలకు దమ్ముంటే ఇంటింటికీ వెళ్లి ఏం చేశారో చెప్పగలవా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ఐదేళ్లలో ఏం చేశారో జనంలోకి వెళ్లి చెప్పే ధైర్యముందా? అని నిలదీశారు. కుప్పంలో కూడా చంద్రబాబుకు ఓటమి తప్పదన్నారు.

జగన్‌ను ఓడించడం ఎవరికీ సాధ్యం కాదని మంత్రి ఆర్కే రోజా ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసొచ్చినా వైఎస్‌ఆర్‌సిపిని ఓడించలేరని చెప్పుకొచ్చారు. జగన్‌పై కుట్రలు, నీతిలేని రాజకీయాలు చేయాలని చూస్తే టిడిపి, జనసేన పార్టీలను తరిమి కొడతామన్నారు. వైఎస్‌ఆర్‌సిపి నేతలతో మంచిగా ఉంటే మంచిగా ఉంటుందని.. చెడుకు పోతే చెడుగా ఉంటుందని హెచ్చరించారు. ఓటుకు నోటు కోసం రాష్ట్రాన్ని, రూ.1.50 లక్షల కోట్ల ఆస్తులను నాశనం చేశారని రోజా మండిపడ్డారు. ‘జగనన్నే మా భవిష్యత్‌’ అని ప్రజలు బలంగా చెప్తున్నారని.. దేశంలోనే ఏ సీఎం చేయలేని విధంగా జగనన్న ప్రజాసర్వే చేస్తున్నారని చెప్పారు. మంచి పాలన అందిస్తేనే ఓటు వేయమని అడిగే ధైర్యం ఉంటుందని వ్యాఖ్యానించారు. మాచర్లలో పోలీసులతో అవమానించుకుంటూ తీసుకెళ్లి హైదరాబాద్‌లో వదిలేశారని.. ఇప్పుడు టిడిపి కుళ్లుకునేలా అదే పోలీసుల సెక్యూరిటీతో మాచర్లకు వచ్చానని రోజా అన్నారు. తనను పోలీస్ సెక్యూరిటీతో మంత్రిని చేసిన ఘనత సీఎం జగన్‌కు దక్కుతుందన్నారు.