ఏపిలో పోలవరం కట్టేది సిఎం కెసిఆరేః మంత్రి మల్లారెడ్డి

minister-mallareddy-perform-at-ravindra-bharathi

హైదరాబాద్‌ః మేడే సందర్భంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కార్మిక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాదులోని రవీంద్ర భారతి లో జరిగిన వేడుకల్లో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు. ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి కార్మికులకు శ్రమశక్తి అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి సందడి చేశారు. కార్మికులు ధరించే ఖాకీ ప్యాంటు, చొక్కా వేసుకొని మెడలో ఎర్ర కండువా ధరించారు. సాంస్కృతిక శాఖ కళాకారులతో కలిసి కాలు కదిపారు. మంత్రి శ్రీనివాస్ రెడ్డితో కలిసి డప్పుకొట్టి సందడి చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ..ఏపీలో కుల రాజకీయాలు నడుస్తున్నాయని ఆరోపించారు. సిఎం కెసిఆర్ పవర్ ఎంటో అందరికీ తెలుసునని చెప్పారు. పోలవరం కట్టేది కెసిఆరే నని చెప్పిన మల్లారెడ్డి.. విశాఖ ఉక్కును కూడా ఆయన సాధిస్తారని అన్నారు. పక్క రాష్ట్రాలలో కెసిఆర్ సీఎం కావాలని కోరుకుంటున్నారని మల్లారెడ్డి తెలిపారు. బిజెపి, కాంగ్రెస్ నేతలు సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ లను తిడుతన్నారని వారికి కార్మికుల ఉసురు తగులుతుందంటూ మల్లారెడ్డి వ్యాఖ్యనించారు. కెసిఆర్ స్ఫూర్తి తోనే కార్మికులు కాళేశ్వరం, యాదాద్రి, అంబేద్కర్, సచివాలయాన్ని కట్టారని చెప్పారు. హైదరాబాద్ లో కార్మికులకు మంచి రోజులు వస్తాయని మల్లారెడ్డి వెల్లడించారు.