పర్యావరణ మార్పునకు మనం ఏ మాత్రం బాధ్యులం కాము
న్యూఢిల్లీ: కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..పర్యావరణ మార్పు అనేది రాత్రికి రాత్రే జరిగే అద్భుతం కాదని అన్నారు. హానికర ఉద్గారాల కారణంగా గత 100 ఏండ్లుగా మార్పులు జరుగుతూ వచ్చాయని ఆయన పేర్కొన్నారు. పర్యావరణ సమతుల్యాన్ని దెబ్బతీసే ఉద్గారాల విడుదలలో అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాలే ముందు వరుసలో ఉన్నాయని చెప్పారు.
అగ్రరాజ్యం అమెరికా అత్యధికంగా 25 శాతం ఉద్గారాలను పర్యావరణంలోకి వదులుతున్నదని మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. యూరప్ 22 శాతం, చైనా 13 శాతం ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయని చెప్పారు. నిత్యం పర్యావరణంలోకి విడుదలవుతున్న ఉద్గారాల్లో భారత్ వాటా కేవలం 3 శాతం మాత్రమేనన్నారు. అందువల్ల పర్యావరణ మార్పునకు మనం ఏ మాత్రం బాధ్యులం కామని, ఆ పాపం మనది కాదని మంత్రి పేర్కొన్నారు.
కానీ, ప్రపంచ వ్యవహారాల్లో ఒక బాధ్యతగల భాగస్వామిగా భారత్ పర్యావరణ మార్పులపై పోరాటంలో పాలుపంచుకుంటున్నదని మంత్రి జవదేకర్ చెప్పారు. పారిస్ పర్యావరణ ఒప్పందం ప్రకారం మనం ఉద్గారాల్లో 33 నుంచి 35 శాతం వరకు తగ్గించుకోవాల్సిన అవసరం ఉన్నదని, ప్రస్తుతం ఆ లక్ష్యంలో 21 శాతం పూర్తిచేశామని తెలిపారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/