థాయ్‌లాండ్‌లో అరెస్ట్‌ అయిన చీకోటి ప్రవీణ్

chikoti-praveen-arrested-in-thailand

న్యూఢిల్లీః క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్‌ థాయ్‌లాండ్‌లో అరెస్ట్ అయ్యాడు. పటాయలో మొత్తం 93 మంది ఉన్న ఇండియన్ గ్యాంబ్లింగ్ ముఠాను అక్కడి థాయిలాండ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో చీకోటి ప్రవీణ్ కూడా ఉన్నాడు. ఈ ముఠాలో 14 మంది మహిళలు ఉన్నారు. వీరి నుంచి భారీగా నగదు, గేమింగ్ చిప్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. థాయ్‌లాండ్ పటాయాలోని ఓ విలాసవంతమైన హోటల్‌పై మే1వ తేదీన తెల్లవారుజామున అక్కడి పోలీసులు దాడులు చేశారు. అక్కడ పెద్ద ఎత్తున గ్యాంబ్లింగ్ జరుగుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. మొత్తం 93 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో 80 మందికి పైగా భారతీయులే ఉండటం గమనార్హం. నిందితుల నుంచి రూ. 20 కోట్ల నగదు, 8 క్లోజ్డ్-సర్క్యూట్ టెలివిజన్ కెమెరాలు, 92 మొబైల్స్, మూడు నోట్‌బుక్‌లను పోలీసులు సీజ్ చేశారు.

ఏప్రిల్ 27 నుంచి మే 1 వరకు పటాయాలోని ఓ హోటల్‌లో చాలా మంది భారతీయులు గదులు బుక్ చేసుకున్నారని….క్యాసినో కోసం సంపావో అనే రూమ్ ను అద్దెకు తీసుకున్నారని థాయిలాండ్ పోలీసులు తెలిపారు. డిటెక్టివ్‌ల నుండి వచ్చిన సమాచారం మేరకు హోటల్ పై దాడి చేసినట్లు వెల్లడించారు. సంపావో రూమ్ లో పెద్ద సంఖ్యలో జూదగాళ్లు.. బక్కరా, బ్లాక్‌జాక్‌లు ఆడుతూ కనిపించారని తెలిపారు. తమను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారని చెప్పారు. అరెస్ట్ అయిన వారిలో 83 మంది భారతీయులు, ఆరుగురు థాయ్‌లాండ్‌లు, నలుగురు మయన్మార్ జాతీయులు ఉన్నారని పోలీసులు తెలిపారు.