రేవంత్ రెడ్డి ని హెచ్చరించిన మంత్రి కేటీఆర్
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. ముఖ్యమంత్రి ని పట్టుకొని ఇష్టంవచ్చినట్లు మాట్లాడుతున్నాడు..కచ్చితంగా పరువు నష్టం దావా ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
శనివారం అసెంబ్లీలో పల్లె, పట్టణ ప్రగతిపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ… వాక్ స్వాతత్య్రం ఉందని ఎటుపడితే అటు మాట్లాడుతున్నారని, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న కేసీఆర్ను ఏది పడితే అది మాట్లాడుతారా? అని ధ్వజమెత్తారు. సీఎంతో పాటు అధికారుల పట్ల రేవంత్ మాటలేమిటని అసెంబ్లీలో కాంగ్రెస్ను నిలదీశారు. ఇప్పటికే ఆయనపై వెయ్యి కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేశారని, తామూ వేస్తామన్నారు. రేవంత్ ఆరోపణలపై హెచ్ఎండీఏ, అలాగే ఆ టెండర్ వచ్చిన సంస్థ పరువు నష్టం దావా వేసిందని, ఈ వ్యాజ్యం కోర్టులో ఉందన్నారు
అలాగే ప్రతిపక్షాలకు మూడు చెరువుల నీళ్లు తాగిస్తాం.. మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రిగా కూర్చుంటారు.. మీరు అక్కడ ఉంటారో లేదో చూసుకోవాలని ప్రతిపక్షాలను ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యానించారు. తమకు కట్టడం తెలుసునని.. విపక్షాలకు కూలగొట్టడం మాత్రమే తెలుసునన్నారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి కాంగ్రెస్ కు కనిపించడం లేదని విమర్శించారు. రాబోయే తరాలు గుర్తుపెట్టుకునేలా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో బతుకులు ఆగమైతే.. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం చాలా డెవలప్ అయిందన్నారు.