9 ఏళ్లలో చేసిన ఒక్క మంచిపనైనా మోడీ చెప్పి ఉంటే బాగుండేదిః కెటిఆర్
తెలంగాణ ప్రజలు తమ కుటుంబ సభ్యులన్న కెటిఆర్
హైదరాబాద్ః 9 ఏళ్లలో యువత కోసం చేసిన ఒక్క మంచిపనైనా ప్రజలకు చెప్పి ఉంటే బాగుండేదని ప్రధాని నరేంద్ర మోడీకి మంత్రి కెటిఆర్ కౌంటర్ ఇచ్చారు. వరంగల్ పర్యటనలో భాగంగా బిఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రధాని చేసిన విమర్శలపై ఆయన దీటుగా స్పందించారు. ‘‘కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ రాష్ట్ర ప్రజల 45 ఏళ్ల కల. గుజరాత్కు ప్రధాని రూ.20వేల కోట్లతో లోకోమోటివ్ ఫ్యాక్టరీ ఇచ్చారు. ఇక్కడ రూ.520 కోట్లతో రైల్వే వ్యాగన్ రిపేర్ షాప్ పెట్టడం రాష్ట్ర ప్రజలను అవమానించడమే అవుతుంది” అని కెటిఆర్ అన్నారు.
దేశ చరిత్రలోకే అత్యధిక నిరుద్యోగం సృష్టించిన విఫల ప్రధాని మోడీ అని మండిపడ్డారు. కేంద్రం పరిధిలో 16 లక్షల ఖాళీలను మోడీ భర్తీ చేయలేదని, తెలంగాణలో 2.20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను నింపిన తమపై విమర్శలు చేస్తున్నారని విమర్శలు చేశారు. బిల్లులను ఆమోదించకుండా వర్సిటీల్లో ఖాళీల భర్తీని గవర్నర్ ఆపుతున్నారని, బిల్లులను అడ్డుకుంటున్న గవర్నర్కు ప్రధాని మోడీ ఒక మాట చెబితే బాగుండేదని సెటైర్లు వేశారు. గిరిజన విశ్వవిద్యాలయాన్ని అడ్డుకొని, అడవి బిడ్డల గురించి మాట్లాడటం ప్రధాని కపటప్రేమకు నిదర్శనమని విమర్శించారు.
15 వేల మంది స్థానికులకు ఉద్యోగాలిచ్చే బయ్యారం ఫ్యాక్టరీ గురించి ఒక్క మాట కూడా ప్రధాని మాట్లాడలేదని దుయ్యబట్టారు. నల్ల చట్టాలతో 700 మంది రైతులను పొట్టనబెట్టుకున్న ప్రధాని వ్యవసాయం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ‘‘తెలంగాణ మా కుటుంబం.. రాష్ట్ర ప్రజలు మా కుటుంబ సభ్యులు. వారి అభివృద్ధికి పాటుపడుతున్న తెలంగాణ కుటుంబ పార్టీ మాది” అని అన్నారు. కేంద్ర ఏజెన్సీల బూచిని చూపించి ప్రధాని చేసిన హెచ్చరికలకు మేం భయపడబోమని స్పష్టం చేశారు. తెలంగాణకు వచ్చి ఇక్కడి ప్రభుత్వంపై విమర్శలు చేయడం, అసత్యాలు మాట్లాడటం మోడీకి అలవాటుగా మారిందని మండిపడ్డారు.