జబర్దస్త్ ఆంటీ అంటూ మరోసారి రోజా ఫై నారా లోకేష్ విమర్శలు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన యువగళం పాదయాత్ర లో ప్రజల కష్టాలను తెలుసుకుంటూ..అధికార పార్టీ ఫై , పార్టీ నేతలపై విరుచుకపడుతున్నారు. ప్రస్తుతం యాత్ర తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో కొనసాగుతుంది. యాత్రలో నగరి ఎమ్మెల్యే , మంత్రి రోజా ఫై ఓ రేంజ్ లో విమర్శలు కురిపిస్తున్నారు.
వెంకటరెడ్డి కండ్రిగలో మహిళలతో నారా లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. రోజూ తనకు చీర-గాజులు పంపుతానని ప్రకటించిన రోజాకి తెలుగు మహిళలు సారె పెట్టేందుకు వెళితే వారిని అరెస్టు చేయించిందని ఆరోపించారు. సాటి మహిళల్ని అత్యంత దారుణంగా కొట్టించి, అరెస్ట్ చేయించిన రోజా మహిళల గురించి మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు.
‘జబర్దస్త్ ఆంటీ అవినీతిని ప్రశ్నిస్తే మహిళల్ని కించపరిచినట్టట. నా పళ్లు రాలగొడతానని జబర్దస్త్ ఆంటీ వార్నింగ్లు ఇస్తోంది. పళ్లు రాలగొట్టాల్సి వస్తే ముందుగా చంద్రబాబుకు వార్నింగ్ లు ఇచ్చిన జగన్ రెడ్డి పళ్లు రాలగొట్టాలి ఆంటీ” అంటూ మంత్రి రోజాకి తనదైన శైలిలో లోకేష్ సమాధానం ఇచ్చారు.
“వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 16 హౌస్ కమిటీలు, 8 సీఐడీ కేసులు పెట్టారు. ఒక్కటీ నిరూపించలేకపోయారు. రాజశేఖర్ రెడ్డి, వైస్సార్సీపీ లో ఉన్న లక్ష్మీపార్వతి కూడా మాపై సుప్రీంకోర్టులో వేసిన కేసుల్లో కనీసం ఆధారాలు కూడా చూపలేకపోవడంతో కేసులను కోర్టు కొట్టేసింది. జబర్దస్త్ ఆంటీ… ఇదీ మా చిత్త శుద్ధి ! మేము మా ఆస్తులు ప్రతీ ఏటా ప్రకటిస్తున్నాం. మీ వైస్సార్సీపీ లో మీరు, మీ 150 మంది దొంగలు కూడా ఆస్తులు ప్రకటించగలరా?” అని లోకేష్ సవాల్ విసిరారు.