ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనపై మంత్రి హరీశ్ రావు సెటైర్లు

నాలుగేళ్ల తర్వాత మెడికల్ కాలేజీకి కొబ్బరికాయ కొడతారట!.. హరీశ్ రావు

minister-harish-rao-satirical-comments-on-pm-modi-over-his-telangana-tour

హైదరాబాద్ః ఏప్రిల్ 8న ప్రధాని మోడీ తెలంగాణకు రానున్నారు. ప్రధాని టూర్ నేపథ్యంలో మంత్రి హరీశ్ రావు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎయిమ్స్ లో నాలుగేళ్ల క్రితం మెడికల్ కాలేజీ వస్తే ప్రధాని మోడీ ఇప్పుడు వచ్చి కొబ్బరికాయ కొడతారట, ఈ నాలుగేళ్లు ఏం చేశారని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. ప్రధాని వస్తున్నారని బిజెపి నేతలు చేస్తున్న ప్రచారంపై ఆయన మండిపడ్డారు. ‘ఒక్క మెడికల్ కాలేజీకే ఇంత హడావుడి చేస్తున్నారు.. గతేడాది ఒకేసారి 8 మెడికల్ కాలేజీలకు కొబ్బరి కాయ కొట్టినం, మేమెంతగా చెప్పుకోవాలి’ అని మంత్రి అడిగారు.

బిజెపిది పని తక్కువ ప్రచారం ఎక్కువ అని, సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడమే బిజెపి నేతల పని అని ఎద్దేవా చేశారు. తమది (బిఆర్ఎస్) చేతల ప్రభుత్వమని మంత్రి చెప్పారు. పనిచేసి ప్రజల మనసులు గెలుచుకోవాలని సీఎం కెసిఆర్ చెబుతుంటారని వివరించారు. 40 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో, 20 ఏళ్ల తెలుగుదేశం పాలనలో చేయని పనులను సిఎం కెసిఆర్ 8 ఏళ్లలోనే పూర్తిచేసి చూపించారని హరీశ్ రావు కొనియాడారు. మన దగ్గర కెసిఆర్ అనే అద్భుత దీపం ఉందని ముఖ్యమంత్రిపై పొగడ్తల వర్షం కురిపించారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన కంటి వెలుగు పథకం గురువారానికి కోటి మందికి చేరువైన సందర్భంగా సదాశివపెట్ లో నిర్వహించిన వేడుకల్లో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు.