మెడిసిన్స్ ధ‌ర‌లు పెంచడం ఫై కేంద్రం ఫై మంత్రి హరీష్ రావు ఆగ్రహం

ఇప్పటీకే పెట్రోల్ , డీజిల్ ధరలు , నిత్యావసర ధరలు , గ్యాస్ ధరలు ఇలా ప్రతిదానిపై ధరలు పెంచిన కేంద్రం..ఇప్పుడు మెడిసిన్స్ ధరలు కూడా పెంచడం ఫై తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలను కాపాడే ఔషధాల ధరలను 12 శాతం పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం దారుణమని విమర్శించారు. ఇది ముమ్మాటికీ పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్యాన్ని దూరం చేయడమేనని అన్నారు. యాంటీ ఇన్ఫెక్టివ్, యాంటీ బయోటిక్స్, పెయిన్ కిల్లర్లు, జ్వరం, ఇన్ఫెక్షన్స్, చర్మ వ్యాధులు, ఎనీమియా తదితర చికిత్సల్లో వినియోగించే మెడిసిన్స్ ధరలను పెంచితే అది పేద, మధ్య తరగతి ప్రజలకు మరింత భారం అవుతుందని అన్నారు.

సామాన్యుడిని ఇబ్బంది పెట్టడమే బీజేపీ ప్రభుత్వం పనిగా పెట్టుకున్నద‌ని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసారు. అవకాశం దొరికిన ప్రతిసారీ పెట్రోల్ , డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచి ప్రజల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం, చివరకు జబ్బు చేస్తే ప్రాణాలు కాపాడే మందుల ధరలు కూడా పెంచేందుకు సిద్దమైంది. ఇది అత్యంత బాధాకరం. దుర్మార్గమైన చర్య అని హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు.