బండి సంజయ్‌కు హరీశ్‌ రావు సవాలు

ప్రతిపక్ష నేతలు గోబెల్స్ ప్రచారానికి పాల్పడుతున్నారు

Minister Harish Rao

హైదరాబాద్‌: దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో సిద్ధిపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేతలు గోబెల్స్ ప్రచారానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. సామాజిక మాధ్యమాల్లో బిజెపి అసత్య ప్రచారం చేస్తోందని, ప్రజల దృష్టిని మళ్లించడానికే ఆ పార్టీ నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేస్తోన్న వారిని పోలీసులు అరెస్టు చేశారని చెప్పారు. తెలంగాణలో బీడీ కార్మికులకు ఇచ్చే రూ.2వేల పింఛనులో రూ.1,600 ప్రధాని మోడి ఇస్తున్నారని బిజెపి నేతలు చెబుతున్నారని హరీశ్ రావు అన్నారు. బీడీ కార్మికులకు ఇచ్చే పింఛనులో 16 పైసలు కూడా మోడి ఇవ్వట్లేదని ఆయన చెప్పారు. మోడి డబ్బులు ఇస్తున్నట్లు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని తెలిపారు.

బిజెపి పాలిత రాష్ట్రాల్లో బీడీ కార్మికులకు పింఛన్లు ఇవ్వట్లేదని హరీశ్ రావు వివరించారు. దుబ్బాక నుంచి బండి సంజయ్‌కు సవాలు విసురుతున్నానని, దుబ్బాక ప్రజల మధ్య బహిరంగ చర్చకు రావాలని ఆయన అన్నారు. తెలంగాణలో కెసిఆర్ కిట్ గురించి కూడా అసత్య ప్రచారం చేస్తున్నారని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే కెసిఆర్ కిట్ అందిస్తున్నామని వివరించారు. అబద్ధాల పునాదుల మీద కొందరు రాజకీయాలు చేస్తున్నారని, ఇటువంటి వారు రేపు గెలిస్తే ప్రజలకు ఏం చేస్తారు? అని హరీశ్ రావు ప్రశ్నించారు. అబద్ధాల మీదే ఆధారపడి ఓట్లు సంపాదించుకుంటామంటే ఈ దుబ్బాక గడ్డ మీద నడవదని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. బిజెపి నేతలు కరపత్రాల ద్వారానూ అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అసత్యాలు ప్రచారం చేశారు కాబట్టే హుజూర్ నగర్‌లో బిజెపికి నాలుగో స్థానం వచ్చిందని, దుబ్బాక ప్రజలు కూడా బండి సంజయ్‌కు హరీశ్‌ రావు సవాలుకి గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు. ఎప్పుడైనా అంతిమంగా ధర్మానిదే విజయమని హరీశ్ రావు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇవ్వాలని అడిగామని, రాష్ట్ర బిజెపి నేతలు సమర్థులైతే అది తీసుకురావాలని ఆయన సవాలు విసిరారు.  


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/