TDP నేత మన్నెం వెంకటరమణ కన్నుమూత
టీడీపీ పార్టీ లో విషాదం నెలకొంది. టీడీపీ నేత, ఎన్నారై మన్నెం వెంకటరమణ (53) కన్నుమూశారు. అమెరికాలోని న్యూజెర్సీ నుంచి విమానంలో హైదరాబాద్ వస్తుండగా గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయనను ఏథెన్స్ విమానాశ్రయంలోని ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతిచెందారు. కాగా వెంకటరమణ 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆయన అమెరికాలోని పలు జాతీయ స్థాయి తెలుగు సంఘాల్లో కీలకపాత్ర పోషించారు.
ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి ప్రకాశం జిల్లా, దర్శి ప్రాంతానికి చెందిన మన్నెం వెంకటరమణ దశాబ్దాల కిందటే అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు. ఈ క్రమంలో ఆయన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (‘తానా’) లోనూ ఆయన యాక్టివ్గా పనిచేసేవారు. ఎంతో మంది భారత్ నుంచి అమెరికాకు వచ్చిన నిరుద్యోగులకు న్యూజెర్సీలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించి, తన ఉదారతను, మనసును చాటుకున్నారు. ‘మన్నెం వెంకటరమణ’ గీత అనే మహిళను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి దాంపత్యానికి గుర్తుగా ఇద్దరు అబ్బాయిలు, ఒక పాప కలిగారు.కాగా, 2009 ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ప్రకాశం జిల్లాలోని దర్శి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయనకు 53 వేల పైచిలుకు ఓట్లు లభించాయి. అయితే కాంగ్రెస్ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ చేతిలో గెలుపు గుర్రం ఎక్కలేక పోయారు.‘మన్నెం వెంకటరమణ’ మృతి పట్ల ఎన్నారైలు, ‘తానా’ పరివారం, ‘తానా’ అధ్యక్షుడు ‘నిరంజన్ శృంగవరపు’ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.