రాష్ట్రంలో నేటి నుండి విద్యాసంస్థలు ప్రారంభం

స్కూలుకు వెళ్లాలంటే తల్లిదండ్రుల అంగీకార లేఖ తప్పనిసరి

హైదరాబాద్‌: తెలంగాణలో నేటి నుండి విద్యాసంస్థలు తెరుచుకున్నాయి. దాదాపు ఏడు నెలలుగా మూతబడిన విద్యాసంస్థలు ప్రభుత్వ సడలింపులతో నేటి నుంచి 9, 10 తరగతులతోపాటు ఇంటర్, డిగ్రీ, ఇతర వృత్తి విద్య కళాశాలల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభం కానుంది. వైద్య కళాశాలలు, సంక్షేమ గురుకుల విద్యాలయాలు కూడా నేటి నుంచి తెరుచుకోనున్నాయి. అయితే, పిల్లలను బడికి పంపేందుకు తమకు అభ్యంతరం లేదన్న తల్లిదండ్రుల లేఖ ఉంటేనే విద్యార్థులను అనుమతిస్తారు.

పాఠశాల తరగతి గదిలో విద్యార్థుల మధ్య ఆరడుగుల దూరం తప్పనిసరి. క్లాస్ రూములో 20 మంది విద్యార్థులను మాత్రమే అనుమతిస్తారు. మధ్యాహ్న భోజనం, టాయిలెట్లు, చేతులు శుభ్రం చేసుకునే ప్రాంతాల్లో గుండ్రని గీతలు గీశారు. విద్యార్థులు వాటి ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుంది. ప్రతి స్కూల్‌లోనూ ఓ ఐసోలేషన్ గదిని ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఎవరిలోనైనా కరోనా లక్షణాలు కనిపిస్తే ఆ గదికి పంపించి తల్లిదండ్రులకు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు సమాచారం అందిస్తారు. అవసరమైన విద్యార్థులకు ప్రాథమిక వైద్యం అందించేందుకు వైద్యులు 24 గంటలూ అందుబాటులో ఉంటారు. తెలంగాణలోని 970 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ గురుకుల పాఠశాలలు కూడా నేటి నుంచి తిరిగి తెరుచుకోనున్నాయి.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/