వైసీపీ విజయం సాధించిన వెంటనే 6 నెలల్లోనే రోడ్లు వేస్తాం- కొడాలి నాని
ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అధికార – ప్రతిపక్ష పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేపనిలో పడ్డాయి. ఉచిత హామీలు ప్రకటిస్తూ ఓటర్లను దగ్గర చేసుకుంటున్నాయి. ఇప్పటికే సిద్ధం అంటూ జగన్ , రావు కదలిరా అంటూ టీడీపీ పోటాపోటీగా సభలు నిర్వహిస్తూ ప్రచారం ముమ్మరం చేసాయి. ఇదే క్రమంలో ఇరు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు కూడా గట్టిగా పేలుతున్నాయి. కాగా వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి రోడ్ల విషయంలో పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ప్రజల నుండి ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయి. ఇప్పటికే చాలామంది నేతలను రోడ్ల గురించి నిలదీసిన సందర్భాలు ఉన్నాయి.
అందుకే ఈసారి ఖచ్చితంగా రోడ్లు వేస్తాం అంటూ మాట ఇస్తున్నారు. తాజాగా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిస్తే తొలి ఆరు నెలల్లోనే రోడ్లన్నీ వేస్తామని హామీ ఇచ్చారు. రోడ్లపై సీఎం జగన్ మేనిఫెస్టోలో కీలక ప్రకటన చేయబోతున్నారని చెప్పారు. చంద్రబాబు హయాంలోని పెండింగ్ బిల్లులు క్లియర్ చేయడానికే తమకు 2 ఏళ్లు పట్టిందని అన్నారు. ఆ తర్వాత కరోనా వచ్చి, పనులు ఆగిపోయాయని నాని వివరించారు. మరి ఈసారి ప్రజలు వైసీపీ ని నమ్ముతారో లేదో చూడాలి.