యూట్యూబ్‌ లో చూస్తూ భార్య కు కాన్పు చేసిన భర్త.. భార్య మృతి

యూట్యూబ్ మాధ్యమం ఇప్పుడు మనిషిలో భాగమైంది. లేచినదగ్గరి నుండి పడుకునే వరకు సగటు మనిషి ఎక్కువ సమయం యూట్యూబ్ తోనే గడుపుతున్నాడు. అంతే కాదు యూట్యూబ్ ద్వారా ఇంట్లోనే కూర్చుని లక్షలు సంపాదించుకునే అవకాశం ఉండడం తో అంత యూట్యూబ్ పైనే పడ్డారు. ప్రతిదీ యూట్యూబ్ ద్వారా తెలుసుకోవడం..ఆ పనులు చేయడం చేస్తున్నారు. తాజాగా ఓ భర్త..తన భార్య కు యూట్యూబ్ లో చూస్తూ కాన్పు చేయడం తో ఆ భార్య మృతి చెందింది. ఈ సంఘటన తమిళనాడులో ఆలస్యంగా వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా హనుమంతపురానికి చెందిన మాదేశ్‌కు(27) పొచ్చంపల్లి సమీపంలోని పులియంబట్టికి చెందిన వేడియప్పన్‌ కూతురు లోకనాయకి(27)తో రెండేళ్ల క్రితం వివాహమైంది. అగ్రికల్చర్‌ కోర్సులో డిగ్రీ చేసిన వారిద్దరూ తమ ఇంటి పెరట్లో సేంద్రీయ పద్ధతిలో పండించిన కూరలనే తినేవారు. ఇటీవల లోకనాయకి గర్భం దాల్చింది. దీంతో, వారు ప్రసవం కూడా సహజపద్ధతిలో జరగాలని నిర్ణయించుకున్నారు. అది మొదలు మాదేశ్‌ యూట్యూబ్‌లో వీడియోలూ చూస్తు ప్రసవం ఎలా చేయాలనే విషయంపై అవగాహన పెంచుకునేవాడు. మంగళవారం లోకనాయకికి నొప్పులు మొదలవడంతో మాదేశ్‌ తన యూట్యూబ్‌ జ్ఞానంతో ఆమెకు ప్రసవం చేశాడు. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన లోకనాయకికి ఆ తరువాత తీవ్ర రక్తస్రావమైంది. దీంతో, కంగారు పడిపోయిన మాదేశ్‌ ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆమె అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ప్రకటించారు. డాక్టర్స్ ఇచ్చిన ఫిర్యాదులో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భర్తతో పాటు ఇతర కుటుంబసభ్యులను విచారిస్తున్నారు.