యాదాద్రి, కేబుల్ బ్రిడ్జి సహా 5 నిర్మాణాలకు అంతర్జాతీ అవార్డులు

గ్రీన్ యాపిల్ అవార్డులు ప్రకటించిన లండన్ సంస్థ

హైదరాబాద్‌ః అంతర్జాతీయ పురస్కారాలలో తెలంగాణ తన ఖ్యాతిని మరోసారి చాటుకుంది. లండన్ లోని గ్రీన్ ఆర్గనైజేషన్ ప్రకటించిన అవార్డుల జాబితాలో తెలంగాణలోని ఐదు కట్టడాలకు చోటు దక్కింది. రాష్ట్రంలో ఇటీవల నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని గ్రీన్ యాపిల్ అవార్డు వరించింది. బ్యూటిఫుల్ వర్క్ స్పేస్ బిల్డింగ్ కేటగిరీలో తెలంగాణ సచివాలయం ఈ అవార్డును గెల్చుకుంది.

హెరిటేజ్ కేటగిరీలో మొజాం జాహీ మార్కెట్ ను గ్రీన్ యాపిల్ అవార్డు వరించగా.. దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జికి యూనిక్ డిజైన్ కేటగిరీలో, స్పెషల్ ఆఫీస్ కేటగిరిలో రాష్ట్ర పోలీసుల ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు, మతపరమైన నిర్మాణాల కేటగిరిలో యాదాద్రి ఆలయానికి గ్రీన్ యాపిల్ అవార్డు వచ్చింది. తొలిసారి ప్రకటించిన ఈ ప్రతిష్టాత్మక అవార్డుల ప్రదానోత్సవం ఈ నెల 16న లండన్ లో జరుగనుంది.

‘అందమైన భవనాల కోసం ఇంటర్నేషనల్ గ్రీన్ యాపిల్ అవార్డ్స్’ లకు రాష్ట్ర ప్రభుత్వం తరపున డిపార్ట్‌మెంట్ అర్బన్, రియల్ ఎస్టేట్ సెక్టార్ దరఖాస్తు చేసినట్లు మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ కార్యదర్శి అరవింద్ కుమార్ తెలిపారు. తెలంగాణలోని నిర్మాణాలకు అంతర్జాతీయ అవార్డులు రావడం రాష్ట్రానికి గర్వకారణమని ఆయన తెలిపారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ అవార్డులను అరవింద్ కుమార్ అందుకోనున్నారు.