డిపాజిట్లు రాని, అభ్యర్థులు లేని పార్టీలోకి ఎవరు పోతారుః బండి సంజయ్

తమ పార్టీ నుంచి వెళ్లిపోతున్నారంటూ మీడియానే ప్రచారం చేస్తోందని ఆరోపణ

bandi-sanjay

హైదరాబాద్‌ః బిజెపి నేతలు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో నేతల మధ్య విభేదాలు, కొందరు పార్టీ మారుతారంటూ జరుగుతున్న ప్రచారంపై రిపోర్టర్లు ప్రశ్నించగా.. పార్టీ మార్పుపై ఎవరి ఆలోచనలు వారివన్నారు.

‘‘ఎవరి పార్టీ, ఎవరు మారుతారనేది వాళ్ల రాజకీయ ఆలోచనలకు అనుగుణంగానే ఉంటుంది. మునిగిపోయే నావలోకి వెళ్తామనే వాళ్లను మేం ఎవ్వరం ఆపబోం’’ అని బండి సంజయ్ అన్నారు. రిపోర్టర్ క్లారిటీ కోసం అడిగేందుకు ప్రయత్నించగా.. ‘‘బిజెపి నుంచి ఎవ్వరూ పోరు’’ అని అన్నారు.

తమ పార్టీ నుంచి వెళ్లిపోతున్నారంటూ మీడియానే ప్రచారం చేస్తోందని ఆరోపించారు. డిపాజిట్లు రాని, అభ్యర్థులు లేని పార్టీలోకి ఎవరు పోతారని ప్రశ్నించారు. ఎన్నికలు వస్తున్నందుకే కెసిఆర్‌కు అమరవీరులు గుర్తొచ్చారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ఏనాడూ కనీసం అమరవీరులకు జోహార్లు చెప్పలేదని కెసిఆర్ పై మండిపడ్డారు. తెలంగాణలో అరాచక, కుటుంబ పాలనను అంతమొందిస్తామని అన్నారు.