కర్ణాటక లో కొనసాగుతున్న బిజెపి నేతల రాజీనామాలు

వచ్చే నెలలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పార్టీలన్నీ తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో టికెట్ దక్కని వారు ఆయా పార్టీల నుండి బయటకు వస్తున్నారు. ముఖ్యంగా బిజెపి నుండి పెద్ద ఎత్తున నేతలు బయటకు వస్తున్నారు. కర్ణాటకలోని మొత్తం 224 స్థానాలకుగాను బీజేపీ బుధవారం 189 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ మేరకు తొలి జాబితా విడుదల చేయగా.. తొలి జాబితాలో పేరులోని సిట్టింగ్‌లు, సీనియర్‌ నేతల నుంచి బీజేపీకి అసంతృప్తుల సెగ మొదలైంది.

అసెంబ్లీ టికెట్‌ను ఆశించి భంగపడిన వారిలో కొందరు నేతలు బీజేపీకి రాజీనామా చేసి బయటకు రాగా.. ఈరోజు మరో సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా పార్టీకి గుడ్‌ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం మడిగెరె నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ కుమారస్వామికి బీజేపీ టికెట్‌ నిరాకరించింది. తొలి జాబితాలో ఆయన స్థానాన్ని మరో అభ్యర్థికి కేటాయించారు. దాంతో ఎంపీ కుమారస్వామి రాజీనామాకు సిద్ధమయ్యారు. ఈరోజు స్పీకర్‌కు తన రాజీనామా లేఖ సమర్పిస్తానని ప్రకటించారు. కుమారస్వామి బాటలోనే మరికొంతమంది నేతలు ఉన్నట్లు తెలుస్తుంది.