రాష్ట్ర చిహ్నంలో చార్మినార్ను తొలగించడం అంటే హైదరాబాదీలను అవమానించడమే: కేటీఆర్
![](https://www.vaartha.com/wp-content/uploads/2024/05/ktr-will-participate-in-brs-dharna-at-charminar.jpg)
హైదరాబాద్: నగర ప్రగతి కనిపించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పుల ప్రతిపాదన దృష్ట్యా బీఆర్ఎస్ నేతలు చార్మినార్ వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లడుతూ.. ”కేసీఆర్ పేరు కనిపించకుండా ప్రభుత్వం మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. రాజకీయ కక్షతోనే మార్పు చేస్తోంది. రాష్ట్ర చిహ్నంలో చార్మినార్ను తొలగించడం హైదరాబాదీలను విస్మరించడమే. అమరవీరుల స్థూపం, తెలంగాణ సాంస్కృతిక చిహ్నాలను చేర్చితే అభ్యంతరం లేదు. చిహ్నంలో కాకతీయ తోరణం, చార్మినార్ను తొలగించడం మూర్ఖపు నిర్ణయమే. హైదరాబాద్ ఐకాన్గా చార్మినార్ ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది. తెలంగాణ ఉద్యమంలో సీఎం రేవంత్రెడ్డి పాల్గొనలేదు. కేసీఆర్ పెట్టిన గుర్తులు మార్చాలని ఆయన చూస్తున్నారు. లోగో మార్పుపై బీఆర్ఎస్ తరఫున నిరసన కార్యక్రమాలు చేపడతాం” అని కేటీఆర్ తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటున్నదని కేటీఆర్ విమర్శించారు. ఎన్నో పోరాటాలు, త్యాగాలతో తెలంగాణ సాధించుకున్నామని చెప్పారు. పదేండ్లలో సాధించిన ప్రగతిని కాదని కాంగ్రెస్ సర్కార్ మొండి వైఖరి అవలంభిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పుల నేపథ్యంలో మాజీ మంత్రులు పద్మారావు గౌడ్, రాజయ్య, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, పార్టీ నాయకులతో కలిసి చార్మినార్ వద్ద కేటీఆర్ నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. లోగో నుంచి కాకతీయ కళాతోరణం, చార్మినార్ను తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ సర్కార్ ఉద్దేశ పూర్వకంగా రాజముద్రను మారుస్తున్నదని చెప్పారు.