తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నం ఇదేనా..? ఫొటో వైరల్‌

official symbols of Telangana state..? The photo is viral

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ సర్కార్‌ రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పులు చేస్తున్నది. ఇప్పటివరకు లోగోలో ఉన్న కాకతీయ కళాతోరణం, చార్మినార్‌ను తొలగించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారిక లోగో ఇదేనంటూ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. పలు రకాల లోగోలు డిజైన్‌ చేయగా.. రాజముద్రలో మూడు సింహాల జాతీయ చిహ్నం, వ్యవసాయం, తెలంగాణ అమరవీరుల స్తూపం, కాంగ్రెస్‌ పతాకంలోని రంగులకు చోటు లభించినట్లు తెలుస్తున్నది. ఈ లోగోను దాదాపు ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. సాయంత్రం 4 గంటలకు రాజకీయ పార్టీల నేతలతో భేటీ తర్వాత రాష్ట్ర చిహ్నాన్ని ఖరారు చేసే అవకాశం ఉన్నది.

కాగా, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పేందుకు, అమరవీరుల త్యాగాలను చాటిచెప్పేలా తెలంగాణ చిహ్నం ఉండబోతోందని సీఎం రేవంత్ ఇప్పటికే సూచనప్రాయంగా వెల్లడించారు. ఆ మేరకు నాలుగైదు నమూనాలను కూడా పరిశీలించారు. అయితే వీటిలో ఏది ఫైనల్ అవుతుందనేది సస్పెన్స్ గా మారింది.

మరోవైపు తెలంగాణ ప్రభుత్వ పరిశీలనలో మరికొన్ని అధికారిక చిహ్నాలు ఉన్నట్లు సమాచారం. రుద్రరాజేశం పలు రకాలుగా లోగోలు డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ మ్యాప్లో బతుకమ్మ, చార్మినార్, రాజముద్రలో ఒక లోగో తయారీ చేశారు. తెలంగాణ మ్యాప్లో బతుకమ్మ, అమరవీరుల స్థూపంతో మరో లోగో డిజైన్ చేసినట్లు విశ్వనీయ సమాచారం. దీంతో.. అమరవీరుల స్థూపం, రాజముద్రలో మరో లోగో వైరల్ గా మారింది. అన్ని లోగోలను పరిశీలిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఆవిర్భావ దినోత్సవం రోజు లోగోను రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించనుంది. లోగో ఖరారుపై సీనియర్ నేతలతో సీఎం రేవంత్ ఇవాళ చర్చించనున్నారు. పార్టీ నేతలతో భేటీ తర్వాత ఇవాళ రాష్ట్ర చిహ్నాన్ని ఖరారు చేసే అవకాశాలున్నాయి.