నేడు ఉప్పల్లోని ఈ స్కైవాక్ ప్రారంభం..
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో ఉప్పల్ రింగ్ రోడ్డులో నూతనంగా నిర్మించిన స్కైవాక్ ను నేడు మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఉదయం 11 గంటలకు ఈ ప్రారంభోత్సవం జరగనుంది. దీంతో పాటూ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడతారు. ఉదయం 11.30కి కేటీఆర్… ఉప్పల్ శిల్పారామంలో నిర్మించిన మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ను ప్రారంభిస్తారు. అలాగే.. మధ్యాహ్నం 12 గంటలకు ఉప్పల్ మున్సిపల్ గ్రౌండ్లో పబ్లిక్ మీటింగ్లో పాల్గొంటారు.
ఈ స్కైవాక్ను రూ. 25 కోట్ల వ్యయంతో నిర్మించారు. దాదాపు 1,000 టన్నులకు పైగా స్టీల్ను వినియోగించి, అధునాతనంగా స్కైవాక్ను తీర్చిదిద్దారు. స్కైవాక్కు ఆరు ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఏర్పాటు చేశారు. నాగోల్ రోడ్డు, రామంతాపూర్ రోడ్డు, జీహెచ్ఎంసీ థీమ్ పార్క్, జీహెచ్ఎంసీ ఆఫీసు సమీపంలోని వరంగల్ బస్టాప్, ఉప్పల్ పోలీసు స్టేషన్, ఉప్పల్ ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ ఎదురుగా ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను ఏర్పాటు చేశారు.
భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని ఈ స్కైవాక్ను ఏర్పాటు చేయడం జరిగింది.