వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకూడదన్న ఈసీ ఆదేశాల పిటిషన్.. కొట్టేసిన ఏపీ హైకోర్టు

ap high court
ap high court

అమరావతిః ఎన్నికల నేపథ్యంలో అన్ని కార్యకలాపాల నుంచి ఏపీ వాలంటీర్లను ఎన్నికల సంఘం దూరంగా ఉంచిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్లు పాల్గొనరాదని ఈసీ స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. పెన్షన్లను కూడా వాలంటీర్లు ఇవ్వడానికి వీల్లేదని ఆదేశించింది. ఈ నేపథ్యంలో, వాలంటీర్లు పింఛన్లు ఇవ్వకుండా కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలయింది. గుంటూరుకు చెందిన ఓ మహిళ ఈ పిటిషన్ వేశారు. వాలంటీర్లు ఇంటికి వచ్చి పెన్షన్లు ఇవ్వకపోతే పెన్షనర్లు చాలా ఇబ్బంది పడతారని పిటిషన్ లో ఆమె పేర్కొన్నారు.

ఈ పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది. వాలంటీర్ల విషయంలో ఈసీ చర్యలను హైకోర్టు సమర్థించింది. పెన్షన్లు వేరే మార్గాల్లో అందించాలంటూ కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు పిటిషన్ ను కొట్టేస్తున్నట్టు తెలిపింది. మరోవైపు పింఛన్ దారులు సచివాలయాల వద్ద ఎండలో పడిగాపులు కాస్తున్నారు. తాగునీరు, నీడ లేక ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలోని పలు మండలాల్లో ఇంకా పింఛన్ పంపిణీ ప్రారంభం కాలేదు. పింఛన్లు రేపు ఇస్తామని పలు చోట్ల అధికారులు చెపుతున్నారు.