చంద్రబాబు కు థాంక్స్ చెప్పిన మంత్రి కేటీఆర్
ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు లకు మంత్రి కేటీఆర్ థాంక్స్ చెప్పారు. తెలంగాణ అభివృద్ధి గురించి వారు ఎంతో గొప్పగా చెపుతున్నారు. కానీ ప్రతి పక్ష పార్టీలకు మాత్రం తెలంగాణ అభివృద్ధి కనిపించడం లేదని ఎద్దేవా చేసారు.
తెలంగాణ అభివృద్ధిని ఒప్పుకున్న చంద్రబాబుకు ధన్యవాదాలు. కేసీఆర్కు రైతులపై ప్రేమ ఉన్నందునే మీటర్లకు ఒప్పుకోలేదని చంద్రబాబు అన్నారు. తెలంగాణలో శాంతిభద్రతలను ఏపీ సీఎం జగన్ కూడా మెచ్చుకున్నారు. దిశ ఘటన విషయంలో ఐ సెల్యూట్ టు కేసీఆర్ అని జగన్ కూడా అన్నారు. తెలంగాణ శాంతి భద్రతలను మెచ్చుకున్న జగన్కు కూడా ధన్యవాదాలు. జగన్, చంద్రబాబుకు అర్థమైన విషయాలు విపక్షాలకు అర్థం కావట్లేదు అని కేటీఆర్ పేర్కొన్నారు.
అలాగే బిజెపి ఫై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్, బీజేపీలు ఢిల్లీ వదిలిన బాణాలు. కానీ తెలంగాణ గల్లీ నుంచి ప్రజలు తయారు చేసిన బ్రహ్మాస్త్రం కేసీఆర్. అందుకే నిర్ణయాలు మెరుపువేగంతో జరుగుతున్నాయి. ప్రజల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి. రాజకీయాలు, ప్రజాజీవితం అంటే టెన్ జన్పథ్ కాదు.. తెలంగాణ జనపథంతో కలిసి కదం తొక్కితే అప్పుడు ఆదరణ ఉంటది కానీ, టెన్ జన్పథ్ చుట్టూ చక్కర్లు కొడితే మీ వల్ల ఏం కాదు అని కేటీఆర్ పేర్కొన్నారు.