ఆర్టీసీ విలీనంపై కెసిఆర్ నాలుగేళ్లు ఆలోచిస్తే, గవర్నర్ ఆలోచించవద్దా?: బండి సంజయ్

కార్మికులకు నష్టం కలగవద్దనే గవర్నర్ బిల్లును పరిశీలిస్తున్నారని వ్యాఖ్య

bandi-sanjay

హైదరాబాద్ః ఆర్టీసీ విలీనంపై తెలంగాణ సిఎం కెసిఆర్ నాలుగేళ్లు ఆలోచించారని, గవర్నర్ కనీసం నాలుగు రోజులు ఆలోచించకూడదా? అని కరీంనగర్ ఎంపీ, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ప్రశ్నించారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ఆగమేఘాల మీద గవర్నర్ స్టాంప్ వేసి ఆ బిల్లును అసెంబ్లీలో పెట్టడానికి ఆమోదం తెలపాలా? అని మండిపడ్డారు. ఈ బిల్లును హడావుడిగా పంపిస్తే అప్పుడు గవర్నర్ సమాధానం చెప్పవలసి ఉంటుందన్నారు. గవర్నర్ భుజం మీద తుపాకీ పెట్టి కాల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కార్మికులకు నష్టం కలగవద్దనే గవర్నర్ బిల్లును పరిశీలిస్తున్నట్లు చెప్పారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ… తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందలేదని బండి సంజయ్ అన్నారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10వేలు ఇస్తానని చెప్పి ఇవ్వలేదన్నారు. పాత పథకాలను తీసివేసి, కొత్త పథకాలను ప్రారంభించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.