బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంబోత్సవానికి కేటీఆర్ హాజరుకాలేకపోతున్నారు

నేడు ఢిల్లీ లో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. సర్దార్‌ పటేల్‌ మార్గ్‌లో బీఆర్ఎస్ తాత్కాలిక కార్యాలయాన్ని ప్రారంభించి, ఆ పార్టీ జెండాను ఎగరవేయనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12.37 గంటలకు ఆ కార్యాలయాన్ని ప్రారంభించి జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ అడుగుపెట్టనున్నారు. ఇక ఈ కార్యక్రమానికి జేడీఎస్‌ నేత కుమారస్వామి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌యాదవ్‌తోపాటు దేశం నలుమూలల నుంచి ప్రముఖ రాజకీయ నాయకులు హాజరుకానున్నారు. అయితే కేటీఆర్ తనయుడు , మంత్రి కేటీఆర్ ఈ ప్రారంబోత్సవానికి హాజరుకాలేకపోతున్నారు.

హైదరాబాద్ లో రెండు ముఖ్యమైన పెట్టుబడి సమావేశాల దృష్ట్యా ఆయన ఇక్కడే ఉంటూ వాటిల్లో పాల్గొనాల్సి ఉంది. జపాన్ కు చెందిన మారుతి సుజుకి సంస్థ ప్రతినిధులతో ఆయన సమావేశం కావాల్సి ఉంది. అలాగే, రాయదుర్గంలోని బోష్ ఆఫీసును ఆయన ప్రారంభిస్తారు. దీంతో ఆయన హైదరాబాద్ లోనే ఉండిపోయారు. కేసీఆర్ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకున్నానని, ఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరుకాలేకపోతున్నానని కేటీఆర్ తెలిపారు.

బుధవారం మధ్నాహ్నం 12 గంటలకు పార్టీ కార్యాలయానికి కేసీఆర్‌ చేరుకొంటారు. అక్కడ నిర్వహిస్తున్న రాజశ్యామల యాగం పూర్ణాహుతిలో పాల్గొంటారు. బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయ ఆవరణలో వేదపండితులు ఫణిశశాంక శర్మ, గోపీకృష్ణ శర్మలతోపాటు వాస్తు నిపుణులు సుద్దాల సుధాకర తేజ తదితరులు యాగ క్రతువులో భాగస్వామ్యులయ్యారు. మంగళవారమే గణపతి పూజతో యాగం మొదలయ్యింది. పూర్ణాహుతి అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం వేదపండితుల ఆశీర్వచనాలు తీసుకొని తన కార్యాలయంలో కుర్చీలో ఆసీనులవుతారు. పార్టీకి సంబంధించిన పత్రాలపై సంతకం చేయనున్నారు.