ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే సాధించాలిః కెటిఆర్‌

బిజెపిని… మోడీని కొట్టడం కెసిఆర్ వంటి ప్రాంతీయ పార్టీల నేతల వల్లే సాధ్యమన్న కెటిఆర్

ktr

హైదరాబాద్‌ః సిఎం రేవంత్ రెడ్డి కెసిఆర్ బొండిగ పిసకాలని అంటున్నారని… కానీ బొండిగ పిసికేయాలో ఎందుకు చెప్పాలని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చే సత్తా లేక తెల్లారితే కెసిఆర్ పైన… బిఆర్ఎస్ పైన పడుతోందని మండిపడ్డారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మనం క్లీన్ స్వీప్ చేసి… కాంగ్రెస్, బిజెపిని ఓడగొట్టామన్నారు. దురదృష్టవశాత్తూ హైదరాబాద్ బయటి జిల్లాల్లో మాత్రం మనకు అనుకూలంగా తీర్పు రాలేదన్నారు. అయినప్పటికీ మనం చాలా చోట్ల స్వల్ప తేడాతో ఓడిపోయామన్నారు. కెసిఆర్ వంటి నాయకుడిని గెలిపించుకోలేకపోయామని చాలామంది ఇప్పుడు బాధపడుతున్నారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మనం ఓడిపోయినప్పటికీ ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమే అన్నారు. జూబ్లీహిల్స్‌లో పార్టీ కోసం కష్టపడి పని చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అన్నారు.

ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే సాధించాలనే సామెతలా… అసెంబ్లీ ఎన్నికల్లో మనం అధికారం చేజార్చుకున్నప్పటికీ… లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిపించి కెసిఆర్ బలంగా ఉన్నారనే విషయాన్ని పార్లమెంట్‌కు చూపించాలన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలో మనం అన్ని అసెంబ్లీ సీట్లు గెలుచుకున్నప్పటికీ పార్లమెంట్ ఎన్నికల్లో గెలవలేకపోయామని గుర్తు చేశారు. కాబట్టి మనం మొదటి నుంచి ప్రణాళికతో ముందుకు వెళ్లాలన్నారు.

కాంగ్రెస్, బిజెపి మనకు కొత్త పార్టీలేమీ కాదన్నారు. మోసం కాంగ్రెస్ పార్టీ నైజమన్నారు. కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. వంద రోజుల్లోనే హామీలు అమలు చేస్తామని నోటికి వచ్చినట్లు చెప్పారని ఆరోపించారు. ఇప్పుడేమో ఇచ్చిన హామీలు నెరవేర్చే సత్తా, సమర్థతలేక మన ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. “కాంగ్రెస్ పార్టీకి… రాష్ట్ర ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి ఏమంటే… నిజానికి పదేళ్లలో తెలంగాణను ఎన్నో రంగాల్లో నెంబర్ వన్‌గా చేసి బంగారు పళ్లెంలో పెట్టి అప్పగించాం” అన్నారు.