చంద్రబాబు ఆదేశాన్ని తు.చ. తప్పకుండా పాటిస్తాః కేశినేని నాని

విజయవాడ టికెట్ వేరే వ్యక్తికి ఇవ్వడంపై సోషల్ మీడియాలో స్పందన

kesineni-nani

అమరావతిః వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ టికెట్ వేరే వ్యక్తికి ఇవ్వాలని టిడిపి నిర్ణయించడంపై ప్రస్తుత ఎంపీ కేశినాని స్పందించారు. పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయాన్ని శిరసావహిస్తానని చెప్పారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

‘‘అందరికీ నమస్కారం. గురువారం సాయంత్రం చంద్రబాబు ఆదేశాల మేరకు మాజీ మంత్రి ఆలపాటి రాజా, ఎన్టీఆర్ జిల్లా టిడిపి అధ్యక్షుడు నెట్టెం రఘురాం, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ నన్ను కలిశారు. ఈ నెల 7న తిరువూరులో జరిగే సభకు వేరే వారిని ఇన్‌ఛార్జ్‌గా నియమించినందున ఆ విషయంలో నన్ను కలగజేసుకోవద్దని చంద్రబాబు చెప్పినట్టు వారు తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో విజయవాడ లోక్‌సభ అభ్యర్థిగా నా స్థానంలో వేరే వారికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారని, పార్టీ వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు ఆదేశించినట్టు తెలిపారు. అధినేత ఆజ్ఞలు తు.చ. తప్పకుండా శిరసావహిస్తానని నేను వారికి హామీ ఇచ్చా’’ అని కేశినేని నాని పేర్కొన్నారు.