ఎన్నికల ముంగిట మరిన్ని పథకాలు ప్రకటించే ఆలోచనలో సిఎం కెసిఆర్‌!: కెటిఆర్‌

పేదలు, రైతుల కోసం బ్రహ్మాండమైన ప్యాకేజీని త్వరలో ప్రకటిస్తారన్న మంత్రి కేటీఆర్

minister-ktr

హైదరాబాద్‌ః అసెంబ్లీ ఎన్నికల ముంగిట తెలంగాణ సిఎం కెసిఆర్‌ మరో పథకాన్ని ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్రంలోని పేదల కోసం మరిన్ని పథకాలు అమలు చేయాలని సిఎం కెసిఆర్‌ ఆలోచిస్తున్నారని ఐటీ శాఖ మంత్రి మంత్రి కెటిఆర్‌ అన్నారు. పేదలు, రైతుల కోసం బ్రహ్మాండమైన ప్యాకేజీ ఉండబోతున్నదని, త్వరలోనే సిఎం కెసిఆర్‌ ఆ విషయాలను ప్రకటిస్తారని వెల్లడించారు. ప్రతిపక్ష నాయకులు పనితో గెలువలేక ఇష్టమొచ్చిన హామీలు ఇస్తున్నారని విమర్శించారు. వాళ్లు చెప్పినదానికంటే ఎకువ సంక్షేమం చేయాలన్నదే సిఎం కెసిఆర్‌ లక్ష్యమన్నారు. ఆ విషయాలను అతి త్వరలోనే సీఎం కేసీఆర్‌ వెల్లడిస్తారని, ప్రజలు తొందరపడొద్దని సూచించారు. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలోని దుండిగల్‌లో డబుల్‌ బెడ్రూం ఇండ్ల సముదాయాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ విషయాన్ని తెలిపారు.

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గత ఆదివారం తుక్కుగూడలో జరిగిన భారీ బహిరంగ సభలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఆరు గ్యారెంటీ హామీలను ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో వీటినే కాంగ్రెస్ ప్రచారాస్త్రంగా మార్చుకుంటున్న నేపథ్యంలో సిఎం కెసిఆర్‌ మరో కొత్త పథకాన్ని అమలు చేస్తారని తెలుస్తోంది. ఇక, ఎన్నికలవేళ రాష్ర్టానికి విపక్ష నాయకులు క్యూ కడుతున్నారని, అడ్డగోలు హామీలు ఇస్తూ ప్రజలను బురిడీ కొట్టించాలని చూస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. ఢిల్లీ, బెంగళూరు నుంచి వచ్చి బూటకపు హామీలు ఇచ్చే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ ప్రజలకు సూచించారు. ఇక, రాష్ట్రంలో అర్హులైన వారందరికీ ఇళ్లు ఇచ్చే బాధ్యత తమదేనని కెటిఆర్ స్పష్టం చేశారు.