రేపు వరంగల్ కు కేటీఆర్..ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రేపు వరంగల్ జిల్లాలో పర్యటించబోతున్నారు. ఈ పర్యటన కు సంబదించిన ఏర్పాట్లను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ పరిశీలించారు. రేపు ఉదయం హెలికాప్టర్ ద్వారా హన్మకొండ ఆర్ట్స్ కళాశాల మైదానానికి కేటీఆర్ చేరుకుంటారు. ఆ తర్వాత 177 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అలాగే నర్సంపేట లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని సమాచారం.

సాయంత్రం 4గంటలకు హాయగ్రీవ చారీ మైదానంలో బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు. సభలోనే వరంగల్ హన్మకొండ జిల్లాల టీఆర్ఎస్ అధ్యక్షులు ఆరూరి రమేష్, వినయ్ భాస్కర్ బాధ్యతలు స్వీకరిస్తారని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. అలాగే భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి కేటీఆర్ ప్రసంగిస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అభివృద్ధి పనులతో కేటీఆర్ బిజీ బిజీగా గడపనున్నట్లు తెలియజేసారు. ఈ సభకు భారీస్థాయిలో జన సమీకరణ చేపట్టాలని టీఆర్ఎస్ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత రాహుల్ గాంధీ మే నెలలో వరంగల్‌లో భారీ సభ నిర్వహించనున్న నేపథ్యంలో అంతకుముందు చేపట్టే ఈ సభను టీఆర్ఎస్ నేతలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు.