మరికాసేపట్లో ప్రారంభం కానున్న కేసీఆర్ రాజశ్యామల యాగం

తెలంగాణ ముఖ్యమంత్రి , బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరికాసేపట్లో రాజశ్యామల యాగం ప్రారభించబోతున్నారు. సీఎం కేసీఆర్‌కు యజ్ఞ యాగాలు చేయడం కొత్తేమీ కాదు..అందులోనూ రాజశ్యామల యాగం చేస్తూ ఉంటారు. ఇప్పుడు కొత్తగా బీఆర్ఎస్ ఆవిర్భవించడం..దేశ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి సిద్దమవుతున్న నేపథ్యంలో యాగం చేయబోతున్నారు. ఢిల్లీలో కొత్తగా బీఆర్ఎస్ ఆఫీసు వద్ద ఈ యాగం నిర్వహించనున్నారు. ఇప్పటికే సతీసమేతంగా ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్.. రెండురోజుల పాటు ఈ యాగం నిర్వహించనున్నారు.

ఈ రాజశ్యామల యాగం కోసం ఇప్పటికే ప్రత్యేక యాగశాలను నిర్మించారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. బీఆర్‌ఎస్‌ నేతలు, ఋత్విక్కులు ఢిల్లీకి చేరుకున్నారు. ముందుగా గణపతి పూజతో రాజశ్యామల యాగాన్ని మొదలు పెట్టనున్నారు. పుణ్యహవాచనం, యాగశాల ప్రవేశం, చండీపారాయణం, మూలమంత్ర జపాలు నిర్వహించనున్నారు. రేపు (బుధవారం) నవ చండీహోమం, రాజశ్యామల హోమం అనంతరం పూర్ణాహుతి కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. శృంగేరిపీఠం గోపీకృష్ణశర్మ, ఫణి శశాంకశర్మ ఆధ్వర్యంలో హోమాలు జరగనున్నాయి.

ఇక ఈ యాగంతో దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ దశ మారుతుందని టీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి. అలాగే యాగం జరిపించిన ప్రతిసారి కేసీఆర్‌కు విజయాలే వచ్చాయి. మరి ఇప్పుడు బీఆర్ఎస్ ఏర్పాడ్డాక యాగం చేస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ కూడా సక్సెస్ అవుతుందని నేతలు భావిస్తున్నారు.