రేపు మేధా సర్వోగ్రూప్ రైల్వేకోచ్ పరిశ్రమను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ రేపు (జూన్ 22) హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. శంకర్ పల్లి మండలం కొండకల్ లో మేధా సర్వోగ్రూప్ రైల్వేకోచ్ పరిశ్రమను ప్రారంభించనున్నారు. అలాగే కొల్లూరులో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించనున్నారు. సీఎం రాక సందర్బంగా రైల్వేకోచ్ పరిశ్రమలో భద్రతా ఏర్పాట్లను హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్కుమార్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రలు పరిశీలించారు. కొల్లూరులో రెండు పడక గదుల ఇళ్ల ప్రారంభోత్సవం అనంతరం సీఎం నేరుగా కొల్లూరు అవుటర్ నుంచి ముత్తంగి జంక్షన్ వద్ద దిగి రైల్వేకోచ్కు చేరుకుంటారు. దేశ ప్రైవేటు రంగంలో అతిపెద్ద ప్రైవేటు రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఇది.
ప్రస్తుతం 25 ఎకరాల్లో నిర్మాణాలు చేపట్టి ప్రాథమికంగా ఉత్పత్తి చేపడుతున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న రెండు వందేభారత్ రైళ్లకు వీటినే బిగించారు. ఇప్పటికే 160 బోగీలు సరఫరా చేసినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. మరో 75 ఎకరాల్లో వ్యాగన్ల తయారీ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.