టిడిపిలో చేరిన యార్లగడ్డ వెంకట్రావు

ఇటీవల వైఎస్‌ఆర్‌సిపికి రాజీనామా చేసిన యార్లగడ్డ

yarlagadda-venkata rao-joins-tdp

గన్నవరం: ఇటీవల వైఎస్‌ఆర్‌సిపికి గుడ్ బై చెప్పిన యార్లగడ్డ వెంకట్రావు ఈరోజు నారా లోకేశ్ సమక్షంలో టిడిపిలో చేరారు. గన్నవరం నియోజకవర్గం నిడమానూరు క్యాంప్ సైట్ లో లోకేశ్ పసుపు కండువా కప్పి యార్లగడ్డను టిడిపి లోకి సాదరంగా ఆహ్వానించారు. అంతకుముందు ఇరువురి మధ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు బుద్ధా వెంకన్న, కొల్లు రవీంద్ర, బొండా ఉమ, పంచుమర్తి అనురాధ, వంగవీటి రాధా తదితరులు పాల్గొన్నారు. టిడిపిలో చేరిన యార్లగడ్డకు వారు శుభాకాంక్షలు తెలియజేశారు.

యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం నియోజకవర్గంలో కీలకనేతగా ఉన్నారు. ఆయన కొంతకాలంగా వైఎస్‌ఆర్‌సిపి కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే… గత ఎన్నికల్లో గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావు స్వల్ప తేడాతో ఓడిపోయారు. అప్పుడాయన వైఎస్‌ఆర్‌సిపి తరఫున పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయనపై గెలిచింది టిడిపి అభ్యర్థి వల్లభనేని వంశీ.

ఇప్పుడదే వంశీ వైఎస్‌ఆర్‌సిపి కి దగ్గర కాగా, యార్లగడ్డ తెలుగుదేశం పక్షాన చేరారు. ఈసారి ఎన్నికల్లోనూ యార్లగడ్డ, వంశీ మధ్య పోరు ఉండే అవకాశాలున్నాయి. ఇటీవలే టిడిపి అధినేత చంద్రబాబును కలిసిన యార్లగడ్డ… చంద్రబాబు చెబితే ఎక్కడ్నించైనా పోటీకి సిద్ధం అంటూ సమర సన్నద్ధతను చాటారు.