నెల్లూరు జిల్లాలో మరో వైస్సార్సీపీ నేత సస్పెండ్

నెల్లూరు జిల్లాలో మరో వైస్సార్సీపీ నేత ఫై వేటు వేసింది అధిష్టానం. రీసెంట్ గా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారంటూ ఏకంగా నలుగురు ఎమ్మెల్యే ల ఫై అధిష్టానం వేటు వేయగా..తాజాగా నెల్లూరు జిల్లాలో మరో కీలక నేత ఫై వేటు వేసింది.

కావలి నియోజకవర్గానికి చెందిన మన్నెమాల సుకుమార్ రెడ్డి పై సస్పెన్షన్ వేటు వేసింది అధిష్టానం. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు నిర్ధారించి.. క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు పార్టీ అధినేత జగన్ ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు. ‘పార్టీ అధ్యక్షులు సీఎం జగన్ రెడ్డి ఆదేశాల మేరకు.. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కావలి నియోజకవర్గానికి చెందిన మన్నెమాల సుకుమార్‌ రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్‌ చేయడమైనది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు ఫిర్యాదులు వచ్చిన నేపధ్యంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు పార్టీ అధ్యక్షుల వారు ఈ నిర్ణయం తీసుకోవడమైనది’ అంటూ ప్రకటన విడుదల చేసారు.

గత కొద్దీ నెలలుగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యేలు, నేతల సస్పెన్షన్ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేశారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనంద రాంనారాయణరెడ్డిలను సస్పెండ్ చేశారు. అంతకముందు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డిని కూడా పార్టీలో సస్పెషన్ వేటు పడింది. దీంతో ఆయన టీడీపీలో చేరారు.. తాజాగా సుకుమార్ రెడ్డి సస్పెన్షన్‌ చర్చనీయాంశమైంది.

మన్నెమాల సుకుమార్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కి ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. అయితే కొంతకాలంగా ఎమ్మెల్యేతో సుకుమార్ రెడ్డికి విభేదాలు మొదలయ్యాయి.. ఈ క్రమంలో పార్టీ ఆఫీస్ ఏర్పాటుకు సుకుమార్ సన్నాహాలు చేశారు. దీంతో ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై సస్పెన్షన్ వేటుపడింది.