భారతీయ ఆర్మీకి హైదరాబాద్ మిస్సైల్ కిట్స్ అందించడం గర్వంగా ఉందిః కెటిఆర్
హైదరాబాద్ః హైదరాబాద్కు చెందిన కళ్యాణి రాఫెల్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్(కేఆర్ఏఎస్) సంస్థ.. భారతీయ రక్షణ దళాలకు మిస్సైళ్లను అందచేస్తున్నది. సుమారు వంద మిస్సైల్ కిట్స్ను ఇండియన్ ఆర్మీకి కళ్యాణి సంస్థ ఇస్తున్నది. ఇండియాలో తొలిసారి క్షిపణులను ఉత్పత్తి చేస్తున్నారు. అది కూడా హైదరాబాద్ అడ్డాగా క్షిపణులను తయారీ చేయడం విశేషం. ఈ నేపథ్యంలో మంత్రి కెటిఆర్ స్పందించారు. తెలంగాణకు చెందిన కళ్యాణి సంస్థ .. భారతీయ ఆర్మీకి మిస్సైల్ కిట్స్ అందించడం గర్వంగా ఉందని మంత్రి కెటిఆర్ అన్నారు. ఆయన తన ట్విట్టర్లో ఈరోజు ఓ పోస్టు చేశారు. రక్షణ రంగంలో హైదరాబాద్ తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నట్లు మంత్రి కెటిఆర్ తెలిపారు. బాబా కళ్యాణ్ జీకి తన ధన్యవాదాలు అంటూ మంత్రి కెటిఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
కాగా, ఇజ్రాయిల్ కంపెనీ రాఫెల్ భాగస్వామ్యంతో కళ్యాణి సంస్థ హైదరాబాద్లో మిస్సైల్ కిట్లను తయారు చేస్తున్నది. ప్రాణాంతకమైన ఆ క్షిపణిని డీఆర్డీవో డెవలప్ చేసింది. ఆర్మీ, నేవీ, వైమానిక దళాలు ఈ క్షిపణులను వాడనున్నాయి. మధ్యశ్రేణికి చెందిన సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైళ్లను సుమారు 30 శాతం వరకు డీఆర్డీవోనే డెవలప్ చేసింది. మిస్సైల్ ప్రొపల్షన్ సిస్టమ్ను కూడా డీఆర్డీవో అభివృద్ధి చేసింది. ఇజ్రాయిల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ సంస్థ ఈ మిస్సైల్ సిస్టమ్కు చెందిన 70 శాతాన్ని డెవలప్ చేసింది. రానున్న నాలుగేళ్లలో వెయ్యి మిస్సైల్ కిట్స్ను ఆర్మీకి అందించనున్నట్లు కళ్యాణి గ్రూపు చీఫ్ బాబా కళ్యాణి తెలిపారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/national/