ఆశ్రునయనాల మధ్య పూర్తయిన కైకాల అంత్యక్రియలు

కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు శనివారం మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. అంతకు ముందు ఫిలింనగర్‌లోని కైకాల ఇంటి నుండి మహాప్రస్థానం వరకు ఆయన పార్థీవ దేహానికి అంతిమయాత్ర చేపట్టారు. కైకాల ను కడసారి చూసేందుకు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కైకాల కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కైకాల సత్యనారాయణ శుక్రవారం ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే, గత కొద్దీ రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న 87 ఏళ్ల సత్యనారాయణ..శుక్రవారం ఉదయం 4 గంటలకు హైదరాబాద్ ఫిల్మ్​నగర్‌‌‌‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. కైకాల మరణవార్త తెలుసుకుని రాజకీయ, సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు.

ప్రధాని నరేంద్ర మోడీ, గవర్నర్ తమిళిసై, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, నటులు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, ఆర్.నారాయణమూర్తి, దర్శకుడు కె.రాఘవేంద్రరావు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.