తెలంగాణలో త్వరలో పాదయాత్ర చేయబోతున్నట్లు ప్రకటించిన కేఏ పాల్

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ త్వరలో తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర చేయబోతున్నట్లు ప్రకటించారు. సిరిసిల్ల జిల్లాలో అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న కేఏ పాల్‌ని సోమవారం టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకోవడం.. ఓ వ్యక్తి ఆయనపై దాడి చేయడం జరిగిన సంగతి తెలిసిందే. తనపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ హత్యాయత్నం చేయించారని ఆరోపించిన పాల్.. మంగళవారం డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కేఏ పాల్.. తాను మళ్లీ సిరిసిల్ల జిల్లకు వెళ్తున్నానని.. ఎవరికైనా దమ్ముంటే ఆపాలని సవాల్ చేశారు.

టీఆర్ఎస్ పార్టీకి రాబోయే ఎన్నికల్లో 20 సీట్ల కంటే ఎక్కువ రావంటూ వ్యాఖ్యానించారు.. అంతేకాకుండా.. తాను ప్రపంచ శాంతి దూతగా రాలేదని… ప్రజాశాంతి పార్టీ అధినేతగా వచ్చానని.. తెలంగాణలో ఇక కేసీఆర్‌ ఆటలు సాగవని మండిపడ్డారు. తనపై దాడి గురించి ఇంకా ప్రపంచ వ్యాప్తంగా తెలియలేదని, హైదరాబాద్‌లో ఉన్న జడ్జీలు, లాయర్లు అందరూ దీన్ని ఖండిస్తున్నారని, గవర్నర్‌ తమిళిసై తనపై దాడిని ఖండించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రపంచం కోసం ఎన్నో యుద్ధాలు చేసిన నేను.. ఎందుకు భయపడుతా… ఇదంతా చేయించిందే ఎస్పీ.. అందుకే డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు వెళ్తుంటే.. గృహనిర్భంధం చేశారన్నారు.

వచ్చే ఎన్నికల్లో ప్రజా శాంతి పార్టీ 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తోందని తెలిపారు. మే 28న సాయంత్రం 5 నుంచి 9 గంటలకు పరేడ్‌ గ్రౌండ్స్‌లో బహిరంగ సభ పెడుతున్నట్లు ప్రకటించారు. అందరూ రండి అని ఆహ్వానించారు. తమకు గ్రౌండ్ పర్మిషన్ ఉందని.. పోలీసులు పర్మిషన్‌ ఇవ్వకపోతే.. కోర్టుకు వెళ్తామన్నారు. త్వరలో పాదయాత్ర చేపడుతానని కేఏ పాల్ ప్రకటించారు.