పెళ్లి వేడుకలో విషాదం..నీటి సంపులో పడి పిల్లాడు మృతి

అప్పటివరకు ఎంతో సంతోషంగా జరుగుతున్న పెళ్లి వేడుక..ఒక్కసారిగా విషాదంలో పడిపోయింది. ఎంతో ఉత్సహంగా డాన్సులు చేసి అలరించిన పిల్లాడు..సడెన్ గా విగతజీవిగా కనిపించి ఆ తల్లి దండ్రులను శోకసంద్రంలో పడేసాడు.

వివరాల్లోకి వెళ్తే..

నందిగామకు చెందిన శ్రీకాంత్ రెడ్డి తన కుమారుడు అభిజిత్ రెడ్డి, ఇతర కుటుంబసభ్యులతో కలిసి బుధవారం శంషాబాద్‌లో ఓ ఫంక్షన్ హాల్‌లో జరుగుతున్న పెళ్లి వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అభిజిత్ రెడ్డి మండపం వద్ద దాండియా ఆడుతూ సందడి చేశాడు. ఆ తర్వాత అభిజిత్ కనిపించకపోయేసరికి పెళ్లి మండపం మొత్తం వెతికారు. ఇంతకీ బాలుడి ఆచూకీ కనిపించకపోవడం తో పోలీసులకు పిర్యాదు చేసారు. రంగంలోకి దిగిన పోలీసులు పలు కోణాల్లో విచారిస్తూ సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. ఈ క్రమంలో ఫంక్షన్ హాల్‌ వెనక తెరిచి ఉన్న నీటిసంపులో చూడగా బాలుడి శవం కనిపించింది. దీంతో, పెళ్లివేడుకలో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. మరోవైపు, ఫంక్షన్ హాల్ నిర్వహకుల నిర్లక్ష్యం కారణంగానే బాలుడు మృతిచెందాడంటూ బంధువులు, స్నేహితులు ఆందోళనకు దిగడంతో అక్కడ ఉద్రిక్తత తలెత్తింది.