సీఐడీ అధికారుల కాల్ డేటా పిటిషన్.. 31న తీర్పు

చంద్రబాబు అరెస్టు సమయంలో అధికారుల కాల్ డేటా ఇవ్వాలని టిడిపి పిటిషన్

Judgment on call data petition of CID officers on 31st

అమరావతిః టిడిపి అధినేత చంద్రబాబును అరెస్టు చేసే సమయంలో సీఐడీ అధికారుల కాల్ డేటా ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్ పై తీర్పును ఏసీబీ కోర్టు రిజర్వ్ చేసింది. ఈ నెల 31న తీర్పు వెలువరిస్తామని న్యాయమూర్తి వెల్లడించారు. చంద్రబాబును అరెస్ట్ సమయంలో సీఐడీ అధికారులు పలువురితో ఫోన్ ద్వారా సంప్రదింపులు జరిపారని టిడిపి ఆరోపించిన విషయం తెలిసిందే.

దీంతో అధికారుల కాల్ డేటా వివరాలు కోరుతూ టిడిపి ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై చంద్రబాబు తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. అరెస్టు సమయంలో అధికారులు ఎవరితో సంప్రదింపులు జరిపారనే విషయం తెలిస్తే కీలక విషయాలు బయటపడతాయని కోర్టుకు తెలిపారు. ఈ కేసులో వాదనలు విన్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి.. తీర్పును రిజర్వ్ చేస్తూ, ఈ నెల 31న తీర్పు వెలువరిస్తామని చెప్పారు.