తన అనుచరులను పవన్ అదుపులో పెట్టుకోవాలి – జోగి రమేశ్ వార్నింగ్
వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో జరిగిన ఘటన పట్ల వైస్సార్సీపీ నేతలు జనసేన పార్టీ ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖ గర్జన ర్యాలీ, బహిరంగ సభను ముగించుకొని ఎయిర్పోర్టుకు వెళ్తున్న టీటీడీ చైర్మన్, వైస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రుల కార్లపై జనసేన కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడికి తెగబడ్డారు, ఈ దాడిలో మంత్రులు జోగి రమేష్, ఆర్కే రోజా కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. అదే విధంగా మంత్రి రోజా సహాయకుడికి గాయాలయ్యాయి. ఈ దాడిని వైస్సార్సీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన కు బాధ్యత వహిస్తూ పవన్ కళ్యాణ్ క్షేమపణలు తెలుపాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ దాడి ఫై జోగి రమేశ్ స్పందిస్తూ..పవన్ కళ్యాణ్ కు వార్నింగ్ ఇచ్చారు. ఈ తరహా దాడులు ప్రజాస్వామ్యంలో సరైనవి కావని , జనసేన శ్రేణులు చిల్లర యవ్వారాలకు పాల్పడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదారు జిల్లాల నుంచి జనసేన కార్యకర్తలను పవన్ కల్యాణ్ విశాఖ తరలించారని, వారంతా మద్యం మత్తులో తమపై దాడులకు పాల్పడ్దారని జోగి రమేశ్ పేర్కొన్నారు. ఈ దాడిలో తమ పార్టీకి చెందిన కిరణ్, దిలీప్ అనే ఇద్దరు కార్యకర్తలకు రక్త గాయాలయ్యాయని అన్నారు. మేమేదో కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు వస్తే… విమానాశ్రయానికి వచ్చిన తమపై దాడి చేయడం మంచి పద్దతి కాదని జోగి రమేశ్ అన్నారు. చిల్లర గాళ్లను పిలిపించుకుని వారిని అరాచకవాదులుగా మార్చే దిశగా పవన్ యత్నిస్తున్నారని మండిపడ్డారు. తమ కార్లపై జనసైనికులు కర్రలు తీసుకుని దాడికి పాల్పడ్డారని చెప్పారు. ఇదేమీ మంచి పద్దతి కాదన్న రమేశ్… ఇప్పటికైనా పవన్ తన అనుచరులను అదుపులో పెట్టుకోవాలని సూచించారు.