కేఏ పాల్ మునుగోడు నామినేష‌న్ తిర‌స్క‌ర‌ణ‌..

మునుగోడు ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం శుక్రవారంతో ముగిసింది. దాదాపు 130 మంది వరకు నామినేషన్లు దాఖలు చేసారు. టిఆర్ఎస్ నుండి ప్రభాకర్ , కాంగ్రెస్ నుండి స్రవంతి , బిజెపి నుండి రాజగోపాల్ , ప్రజాశాంతి పార్టీ నుండి కేఏ పాల్ తో పాటు పలువురు నామినేషన్లు వేశారు. ఈ నేప‌థ్యంలో ఉప ఎన్నిక‌లో పోటీ చేసేందుకు ఆయా పార్టీలు, వ్య‌క్తులు దాఖ‌లు చేసిన నామినేష‌న్ల‌ను అధికారులు శ‌నివారం ప‌రిశీలించారు. ఇందులో భాగంగా నిబంధ‌న‌లకు అనుగుణంగా లేని నామినేష‌న్ల‌ను అధికారులు తిర‌స్క‌రించారు.

ఇలా తిర‌స్క‌ర‌ణ‌కు గురైన నామినేష‌న్ల‌లో ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షుడి హోదాలో కేఏ పాల్ దాఖ‌లు చేసిన నామినేష‌న్ కూడా ఉంది. అయినప్పటికీ పాల్ ఎన్నిక‌ల బ‌రిలో ఉన్న‌ట్లు అధికారులు శ‌నివారం సాయంత్రం ప్ర‌క‌టించారు. నామినేష‌న్ల దాఖ‌లుకు చివ‌రి రోజైన శుక్ర‌వారం కేఏ పాల్ రెండు సెట్ల నామినేష‌న్లు దాఖ‌లు చేశారు. ఓ నామినేష‌న్‌ను ప్ర‌జాశాంతి పార్టీ అధ్యక్షుడి హోదాలో దాఖ‌లు చేయ‌గా… మ‌రో నామినేష‌న్‌ను ఇండిపెండెంట్ అభ్య‌ర్థిగా దాఖ‌లు చేశారు.

ప్ర‌జాశాంతి పార్టీని గుర్తింపు లేని పార్టీగా ఇటీవ‌లే కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించిన సంగతి తెలిసిందే. దీంతో ప్ర‌జాశాంతి పార్టీ అధ్యక్షుడి హోదాలో దాఖలు చేసిన నామినేష‌న్‌ను తిర‌స్క‌రించిన అధికారులు.. ఇండిపెండెంట్ హోదాలో దాఖ‌లు చేసిన నామినేష‌న్‌ను మాత్రం అనుమ‌తించారు.