తాడిపత్రి మున్సిపల్ ఆఫీసు ఆవరణలో జేసీ ప్రభాకర్ రెడ్డి వినూత్న నిరసన

మున్సిపల్ ఆఫీసు ఆవరణలో స్నానం చేసి నిరసన తెలిపిన జేసీ ప్రభాకర్ రెడ్డి

jc-prabhakar-reddy-protest-in-tadipatri

తాడిపత్రిః రాజకీయాల్లో జేసీ సోదరుల పంథానే వేరు. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, టిడిపి నేత జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసన తెలిపేందుకు వినూత్న మార్గం ఎంచుకున్నారు. తాడిపత్రి మున్సిపాలిటీలో అక్రమాలు జరుగుతున్నాయంటూ గళం వినిపిస్తున్న టిడిపి కౌన్సిలర్లకు ఆయన మద్దతు పలికారు. టిడిపి కౌన్సిలర్లకు మద్దతుగా నిన్నటి రాత్రి నుంచి నిరసన చేపట్టిన జేసీ ప్రభాకర్ రెడ్డి… తాడిపత్రి మున్సిపల్ కార్యాలయంలోనే నిద్రించారు. ఉదయాన్నే లేచి, మున్సిపల్ కార్యాలయం ఆవరణలోనే బ్రష్ చేశారు. కార్యాలయం ఎదుటే, ఓ కుర్రాడు పైపుతో నీళ్లు పడతుండగా, జేసీ శుభ్రంగా స్నానం చేశారు. అనంతరం నిరసన శిబిరంలో కూర్చున్నారు.

మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమాలపై కమిషనర్, ఇతర అధికారులు పట్టించుకోవడంలేదని కొంతకాలంగా టిడిపి కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. కమిషనర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ టిడిపి కౌన్సిలర్లు మున్సిపాలిటీ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఈ నిరసనలో జేసీ కూడా పాల్గొన్నారు. కాగా, ఈ నిరసనకు పెద్దపప్పూరు, యాడికి మండలాల టిడిపి శ్రేణులు తరలివచ్చాయి.