మెదడు లేని బంటి, పార్టీ మారే చంటి.. .ప్రతిపక్షాలపై కెటిఆర్‌ విసుర్లు

కెసిఆర్ కాలి గోటికి సరిపోయే నాయకులు తెలంగాణలో ఎవరూ లేరు..కెటిఆర్‌

minister-ktr-comments-on-oppositions

సిరిసిల్లః సిరిసిల్లలో జరిగిన బిఆర్‌ఎస్‌ నియోజకవర్గ ప్రతినిధుల సభలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కెటిఆర్‌, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్‌ మాట్లాడుతూ.. 60 లక్షల మంది గులాబీ దండుకు పేరుపేరున ధన్యవాదాలు తెలిపారు. 22 ఏండ్ల క్రితం హైదరాబాద్‌ జలదృశ్యంలో టిఆర్‌ఎస్‌గా పార్టీ ఆవిర్భవించిందని చెప్పారు. దేశమంతా తెలంగాణ తరహా అభివృద్ధి కోసమే బిఆర్‌ఎస్‌ రూపాంతరం చెందిందని, మారింది టిఆర్‌ఎస్‌ పేరు మాత్రమేనని.. జెండా, గుర్తు, డీఎన్‌ఏ మారలేదన్నారు.

కెసిఆర్‌ కాలి గోటికి కూడా సరిపోయే నాయకుడు ప్రతిపక్షాల్లో లేరని మంత్రి కెటిఆర్ అన్నారు. ఒకరు మెదడు లేని బంటి.. ఇంకొకరు పార్టీలు మారే చంటి.. వాళ్లా ప్రతిపక్షమని ఎద్దేవా చేశారు. సిఎం కెసిఆర్ పాలనలో తెలంగాణలో ప్రతి గ్రామం ఆదర్శంగా మారిందని చెప్పారు. దేశ జనాభాలో 3 శాతం ఉన్న తెలంగాణకు 30 శాతం జాతీయ అవార్డులు వచ్చాయని వెల్లడించారు. ఇదంతా సిఎం కెసిఆర్‌ ప్రారంభించిన పల్లె ప్రగతితోనే సాధ్యమైందన్నారు.

తెలంగాణ రాష్ట్రం సిద్దిస్తేనే యువతకు భవిష్యత్తు ఉంటుందని కేసీఆర్‌ నమ్మారని తెలిపారు. అర్ధబలం, అంగబలం లేకున్నా తెలంగాణ కోసం బయలుదేరారని తెలిపారు. అంతకు ముందు నేతలు తెలంగాణ ఉద్యమం పేరుతో మోసం చేశారనే అభిప్రాయం ప్రజల్లో ఉండేదని చెప్పారు. అయితే ఉద్యమం నుంచి తప్పుకుంటే రాళ్లతో కొట్టి చంపాలని చెప్పిన దమ్మున్న నాయకుడు కెసిఆర్‌ అని వెల్లడించారు. 2013లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి వెళ్తున్నా.. తెలంగాణలోనే అడుగుపెడతానని కెసిఆర్‌ చెప్పారని, అన్నట్టుగానే తెలంగాణ సాధించి తిరిగి వచ్చారని వెల్లడించారు. లక్ష్యాన్ని సాధించిన కెసిఆర్‌ జన్మదన్యమైందని అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కొనియాడారని గుర్తుచేశారు. రాష్ట్రం ఏర్పడిన ఎనిమిదేండ్లలోనే ఎట్లున్న తెలంగాణ ఎంత అభివృద్ధి చెందిందో మన కండ్లముందే ఉందన్నారు.

తెలంగాణలో ప్రతి గ్రామం ఆదర్శంగా మారిందని చెప్పారు. దేశ జనాభాలో 3 శాతం ఉన్న తెలంగాణకు 30 శాతం జాతీయ అవార్డులు వచ్చాయని వెల్లడించారు. ఇదంతా సిఎం కెసిఆర్‌ ప్రారంభించిన పల్లె ప్రగతితోనే సాధ్యమైందన్నారు. జిల్లాలోని గంభీరావుపేటకు జాతీయ స్థాయిలో ఉత్తమ పంచాయతీ అవార్డు వచ్చిందని చెప్పారు. గ్రామ సర్పంచ్‌ కటకం శ్రీధర్‌ను వేదికపైకి పిలిచి అభినందించారు. ఇది గోల్‌మాల్‌ గుజరాత్‌ కాదు.. గోల్డెన్‌ తెలంగాణ అని చెప్పారు.